ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం.. మరోవైపు నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు. కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిత్రాన్ని నిర్మించిన కిరణ్.. సోమవారం మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అనూష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ను శివశంకర నాయుడు. వై. తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు.
పక్షి కాళ్లను చూపిస్తూ విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. ‘‘ఇలాంటి కథను మీరెప్పుడూ చూడలేదు, ఇలాంటి జానర్ను మీరు ఊహించలేదు..” అని రాసిన క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
