హైదరాబాద్, వెలుగు: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, పీఈటీలను వెంటనే స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీల సమావేశంలో పాల్గొన్న ఆయన, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ బాలు నాయక్కు వినతిపత్రం సమర్పించారు.
సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో టీచర్లు, విద్యార్థుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ టీచర్లు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా వేతనంతో కూడిన సెలవు ఇచ్చేలా గతంలో జారీ చేసిన జీవో 342ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.
