TGSRTC బస్ స్టేషన్ లకూ ‘జీపీఎస్’.. పైలెట్ ప్రాజెక్టు కింద జడ్చర్ల బస్ స్టేషన్

TGSRTC బస్ స్టేషన్ లకూ ‘జీపీఎస్’.. పైలెట్ ప్రాజెక్టు కింద జడ్చర్ల బస్ స్టేషన్
  •  స్టేషన్​లో ఎల్​ఈడీ స్క్రీన్​లు ఏర్పాటు 
  •  బస్సు 500 మీటర్ల దూరంలో ఉండగానే ఆటోమెటిక్​ అనౌన్స్​మెంట్​ 
  •  ముందస్తు సమాచారంతో ప్రయాణికులకు మేలు 
  • 20 రోజులుగా ట్రయల్​ రన్​
  •  త్వరలో రాష్ట్రంలోని అన్ని బస్​ స్టేషన్లలో ఇంప్లిమెంట్​కు ప్లాన్​

మహబూబ్​నగర్, వెలుగు : రైల్వే స్టేషన్లలో ఏ మార్గం నుంచి ఏ రైలు వస్తోంది? సమయానికే రైలు వస్తోందా? ఆలస్యం అవుతుందా? ఏ ప్లాట్​ఫాం వద్ద ఆగుతుంది? వంటి వివరాలు క్షణాల్లో ఎల్​ఈడీ స్క్రీన్​​పై, ఆటోమెటిక్​ అనౌన్స్​మెంట్​ద్వారా ప్రయాణికులకు సమాచారం అందుతుంది. 

గ్లోబల్​ పొజిషనింగ్​సిస్టం(జీపీఎస్)​ ద్వారా ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్​డేట్ చేస్తుంటారు. ఇదే తరహా సేవలను ప్రయాణికులకు అందించేందుకు తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) సిద్ధమైంది. అందుకు మహబూబ్​నగర్​జిల్లాలోని జడ్చర్ల బస్​ స్టేషన్​ను పైలట్​ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, జీపీఎస్​ విధానం ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించడం ప్రారంభించింది.

ట్రాన్సిట్​హబ్ గా జడ్చర్ల ఎంపిక

కొద్ది రోజుల కిందట టీజీ ఆర్టీసీ ఆఫీసర్లు ఆయా రాష్ర్టాల్లో పర్యటించారు. అక్కడి ప్రభుత్వాలు ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలు గురించి తెలుసుకున్నారు. కర్నాటక రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో రాయచూర్​బస్​ స్టేషన్​లో జీపీఎస్​ విధానం ద్వారా మెట్రో స్టేషన్​ తరహాలో ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి అక్కడి ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. 

ఈ విధానం ద్వారా ప్రయాణికులకు ఈజీగా బస్సుల సమాచారం చేరుతుండడంతో, ఇదే విధానాన్ని తెలంగాణలోనూ ఇంప్లింమెంట్​ చేయాలని నిర్ణయించారు. మొదట పైలట్​ ప్రాజెక్టు కింద ఒక బస్​ స్టేషన్​లో దీన్ని ఇంప్లిమెంట్​చేసి, విజయవంతం అయ్యాకా మిగతా బస్​ స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించారు. 

ఈ క్రమంలో రాష్ర్టంలో ట్రాన్సిట్​హబ్​(బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలు, ప్రయాణికులు ఒక వాహనం నుంచి మరో వాహనంలో సులభంగా వెళ్లడానికి  వీలుండే ప్రాంతం) గా పేరొందిన మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల బస్​ స్టేషన్​ను ఎంపిక చేశారు.

 ఈ నెల మొదటి వారం స్టేషన్​లో ఎల్​ఈడీ స్క్రీన్​లను, జీపీఎస్​ ట్రాకర్​ ఏర్పాటు చేసి ఆన్​లైన్​కు అనుసంధానం చేశారు. కంప్యూటర్​ను అందుబాటులో ఉంచారు. జీపీఎస్​ ట్రాకర్​ ద్వారా ఏ బస్సు ఎక్కడికి వస్తోంది? ఎప్పుడు వస్తోంది? ఆయా మార్గాల్లో ఏ బస్సు సర్వీసులు వస్తున్నాయి? అని ఎల్​ఈడీ స్ర్కీన్​ మీద డిస్​ప్లే అవుతోంది. 

బస్సు స్టేషన్​కు 500 మీటర్ల దూరంలో ఉండగానే జీపీఎస్​ విధానం ద్వారా అటోమెటిక్​ అనౌన్స్​మెంట్ కూడా వస్తోంది. ఆ బస్సు ఏ ప్లాట్ ఫాం వద్ద  ఆగుతుందో కూడా సమాచారం అందుతోంది. ఈ విధానంపై ప్రయాణికులు కూడా సంతృప్తిగా ఉన్నట్లు టీజీ ఆర్టీసీ ఆఫీసర్ల ఎంక్వైరీలో తేలింది. ఈ వివరాలన్నిటిని రికార్డ్​ చేసి సంస్థకు 20 రోజుల ట్రయల్​ రన్​ సక్సెస్​ అయినట్లు నివేదికను పంపారు. త్వరలో రాష్ర్టంలోని పలు బస్​ స్టేషన్​లలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. 

పెరగనున్న భద్రత

జీపీఎస్​ విధానం ద్వారా ఆర్టీసీలో భద్రత పెరగనుంది. స్టేషన్​లో, బస్సులో జీపీఎస్​ విధానం ఉండడం వల్ల బస్సును లైవ్​ ట్రాకింగ్​ను చేయొచ్చు. ఏదైన ఎమర్జెన్సీ ఏర్పడితే బస్సులోని సెంట్రీ లేదా ప్యానిక్​ బటన్​ నొక్కడం ద్వారా కంట్రోల్​ రూముకు సమాచారం అందుతుంది. బస్సులు ఎక్కడైనా అనవసరంగా ఆగుతున్నాయా, రూట్​ తప్పి వెళ్తున్నాయా అనే సమాచారం కూడా తెలిసిపోతుంది. ఆటోమెటిక్​ వాయిస్​ విధానం ద్వారా ఆయా మార్గాల్లో కొత్తగా ప్రయాణించే వారికి, దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. 

ప్యాసింజర్లు సంతృప్తిగా ఉన్నారు

టీజీ ఆర్టీసీ మొదటి సారి జీపీఎస్​ సిస్టం బస్​ స్టేషన్​లను అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదట పైలట్​ప్రాజెక్టు కింద జడ్చర్ల బస్​ స్టేషన్​ను ఎంపిక చేసి, సేవలు ప్రారంభించింది. జీపీఎస్​ విధానం ద్వారా ఎల్​ఈడీ స్ర్కీన్​, ఆటోమెటిక్​ అనౌన్స్​మెంట్​ గురించి ప్రయాణికులను ఆరా తీయగా బాగున్నాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పై ఆఫీసర్లకు కూడా తెలియజేశాం.

 -కె.అశోక్​ కుమార్, ఆర్టీసీ డీఎం, మహబూబ్​నగర్​