- మంత్రి పొంగులేటి వెల్లడి
- మహేశ్గౌడ్తో కలిసి 400 డబుల్ బెడ్రూం ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ
- ఏడాదిన్నరలో వ్యవసాయ, ఆబాదీ ల్యాండ్ రీసర్వే పూర్తి చేస్తమని వెల్లడి
- తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు శంకుస్థాపన
నిజామాబాద్, వెలుగు: పేదల చిరకాల కోరిక నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తోందని, రెండు విడతల్లో 8 లక్షల ఇండ్లు మంజూరు చేశామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్లోని 43వ డివిజన్ పాములబస్తీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్భవేశ్ కుమార్, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కులమతాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. సొంత జాగా లేక ఇండ్ల స్కీమ్కు దూరమవుతున్న వారి కోసం నిజామాబాద్ సిటీలో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామన్నారు. రెండెకరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు.
భూ రీ సర్వే చేపట్టాం
రాష్ట్రంలో భూసమస్యలకు పర్మనెంట్ పరిష్కారం చూపడానికి రీసర్వే చేపట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏడాదిన్నర కాలంలో పూర్తిచేస్తామన్నారు. కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, ప్రభుత్వ సలహదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ ఉమారాణి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో కలిసి ఉమ్మడి జిల్లా రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల ఆఫీసర్లతో మంత్రి పొంగులేటి రివ్యూ నిర్వహించారు. అగ్రికల్చర్, ఆబాదీ లెక్కలు మొత్తం క్లియర్ చేస్తామని, మొదటి ఫేజ్ రీసర్వే నడుస్తున్న గ్రామాలను కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు పరిశీలించి సమస్యలను అక్కడికక్కడ పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ల్యాండ్ సమస్యలు, సాదాబైనామా ఆర్జీల పరిష్కారంలో శ్రద్ధ చూపని ఆఫీసర్లను మందలించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల రిపేర్లకు నిధులిస్తం
బీఆర్ఎస్ హయాంలో నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేసిన డబుల్బెడ్రూం ఇండ్ల కోసం అర్హులను గుర్తించి కేటాయించాలని ఆఫీసర్లకు మంత్రి సూచించారు. అసంపూర్తి ఉన్న ఇండ్ల రిపేర్లుకు నిధులు కేటాయిస్తామన్నారు. పనులు పూర్తయిన 24 గంటల్లో పేమెంట్స్ చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్స్కు కరెంట్, తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని, శానిటేషన్ పనులు ముగించాలన్నారు. నిజామాబాద్లో మరో 400 డబుల్ బెడ్రూం ఇండ్లను పది రోజుల్లో అర్హులకు అలాట్మెంట్ చేసేలా రెడీ చేయాలని సూచించారు.
ఇండ్ల శాంక్షన్లో ఇందూర్ టాప్: మహేశ్ గౌడ్
ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజాపాలన పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్ తెలిపారు. రాజీవ్గాంధీ ఆడిటోరియంలో మంత్రి పొంగులేటితో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అత్యధిక ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసుకొని టాప్ స్థానంలో ఉందన్నారు.
మహిళలను సంతోషంగా చూడడానికి ఇండ్లు, సన్నబియ్యం, ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్జర్నీ తదితర మహత్తర స్కీమ్లు అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో డెవలప్ చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో రూ.2.25 కోట్ల చొప్పున నిర్మించే సాలూరా, డొంకేశ్వర్, ఏర్గట్ల, మోపాల్, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ పనులకు, రూ.1.75 కోట్లతో నిర్మించనున్న నిజామాబాద్ రూరల్, బోధన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పనులకు పొంగులేటితో కలిసి శంకుస్థాపనలు చేశారు.
