- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఘటన
బోధన్, వెలుగు: ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో డాక్టర్లు, రోగులతో పాటు పోలీసులపైనా దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. సీఐ వెంకటనారాయణ కథనం ప్రకారం.. బోధన్ మండలంలోని కొప్పర్గ గ్రామానికి చెందిన బండారి వినయ్ తన భార్య ట్రీట్ మెంట్ కోసం బోధన్ పట్టణంలోని సర్కార్ హాస్పిటల్ కు వచ్చాడు. డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ వినయ్ మరో వ్యక్తి రామొల్ల సాయిలుతో కలిసి మద్యం మత్తులో డాక్టర్లు, రోగులపై దాడి చేశాడు.
హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా వారు వినిపించుకోకపోవడంతో వినయ్, సాయిలును అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు ఓ కానిస్టేబుల్ పై దాడి చేయగా.. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వినయ్, సాయిలుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.
