న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్లు ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్.. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో చరిత్ర సృష్టించారు. 15 ఏళ్ల తర్వాత విమెన్స్ డబుల్స్లో తొలిసారి ఇండియాకు కాంస్యం పతకం అందించారు. శనివారం హోరాహోరీగా జరిగిన సెమీస్లో ట్రీసా–గాయత్రి 21–18, 13–21, 8–21తో వరల్డ్ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్స్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడారు. 2011లో లండన్లో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో జ్వాలా గుత్తా–అశ్విని పొన్నప్ప జోడీ కాంస్యం గెలిచింది. గంటా 11 నిమిషాల మ్యాచ్లో ట్రీసా–గాయత్రి అద్భుతమైన తెగువను ప్రదర్శించారు. ముఖాముఖి రికార్డులో 1–6తో వెనకబడి ఉన్నా.. ఈ మ్యాచ్లో పోరాట స్ఫూర్తి చూపెట్టారు.
మ్యాచ్ ఆరంభం నుంచే రెండు జంటలు తీవ్రంగా శ్రమించడంతో స్కోరు 18–18 వద్ద సమమైంది. ఈ దశలో ఇండియన్ జోడీ వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్ను సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్లో వ్యూహాత్మకంగా ఆడిన చైనా జోడీ 8–5, 10–9తో ముందంజ వేసింది. షార్ట్ లిఫ్ట్లు, క్రాస్ కోర్టు రిటర్న్స్తో ఇండియన్ ప్లేయర్లను ఒత్తిడికి గురిచేశారు. దాంతో 12–12 స్కోరు వద్ద నుంచి ట్రీసా–గాయత్రి తడబడ్డారు. వరుసగా 8 పాయింట్లు చేజార్చుకుని గేమ్ను కోల్పోయారు. నిర్ణయాత్మక మూడో గేమ్లో 2–2తో స్కోరు సమం చేసిన ఇండియన్ ద్వయం ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. 5–8 స్కోరు వద్ద వరుసగా ఏడు పాయింట్లు కోల్పోవడంతో పుంజుకోలేకపోయింది. ఇక్కడినుంచి దూకుడుగా ఆడిన చైనీయులు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
