హైదరాబాద్, వెలుగు: ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదాల నివారణపై చర్చించడానికి హైదరాబాద్లో శనివారం ఫైర్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ అండ్ ఆటోమేషన్ (ఫెసా) సదస్సు నిర్వహించారు. ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీవీ నారాయణరావు ప్రారంభించారు.
ఫార్మా ప్లాంట్లలో కఠిన నిబంధనలు, ప్రాసెస్ సేఫ్టీ, ముందస్తు పొగ గుర్తింపు పరికరాలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ‘జీరో-యాక్సిడెంట్’ లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో గత పదేళ్లలో ఫార్మా యూనిట్లలో 102 అగ్ని ప్రమాదాలు జరగడంతో రూ.100 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఎఫ్ఎస్ఏఐ ప్రతినిధులు తెలిపారు.
ఫార్మా రంగానికి ముందస్తు రిస్క్ మేనేజ్మెంట్ ఎంతో అవసరమన్నారు. ముందస్తు భద్రత, ఏఐ ఆధారిత టెక్నాలజీలు, స్వతంత్ర ఆడిట్లతో భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలని నిపుణులు సూచించారు. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ నిర్వహణ, స్టాటిక్ డిశ్చార్జ్ నివారణ, తరచూ భద్రతా తనిఖీలు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని వివరించారు.
