న్యూఢిల్లీ: లాభాపేక్ష లేని సామాజిక సంస్థ, న్యూరో డెవలప్మెంటల్ సమస్యలు ఉన్న పిల్లలకు సేవలు అందించే ‘రేస్ ఆఫ్ బిలీఫ్’ ఐపీఓ వచ్చే నెల 1–3 తేదీల్లో ఉంటుంది. 2029 నాటికి దేశవ్యాప్తంగా 319 కేంద్రాలతో వ్యాపారాన్ని విస్తరించాలని సంస్థ యోచిస్తోంది.
యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ఆగస్టు 31 న జరుగుతుంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా 52.30 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ. ఆఫర్- ఫర్- సేల్ లేదు. ప్రీ-ఐపీఓ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ.5.89 కోట్లు సేకరించింది. దీనిని తాజా ఇష్యూకు సర్దుబాటు చేయడంతో ఇష్యూ సైజు తగ్గింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తంతో 319 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రూ.41.36 కోట్లలో రూ.34.99 కోట్లను కేంద్రాల ఫిట్ఔట్ల కోసం, రూ.1.93 కోట్లు థెరపీ -మెటీరియల్ ఇన్వెంటరీ కోసం, రూ.4.44 కోట్లను టెక్నాలజీ హార్డ్వేర్ కోసం ఉపయోగిస్తారు. కంపెనీ ఆదాయం గతేడాది రూ.36.42 కోట్ల నుంచి ఈ సంవత్సరం రూ.81.66 కోట్లకు పెరిగింది. లాభం మాత్రం రూ.5.88 కోట్ల నుంచి రూ.4.96 కోట్లకు తగ్గింది. షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
