- నిషేధిత జాబితాలో 4 లక్షల ఎకరాల ప్రైవేట్ భూములు : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
- సెటిల్మెంట్ల కోసమే భూభారతి స్కామ్ అంటూ ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు: రేషన్కార్డులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో పెట్టకుంటే కేంద్ర ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారులకు బియ్యం ఇస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పేదలకు ఇచ్చే బియ్యంలో కేంద్రం వాటా ఉన్నపుడు కేంద్రం లోగో తొలగించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ దందాలు, సెటిల్మెంట్ల రాజ్యం నడుస్తోందనిఆగ్రహం వ్యక్తం చేశారు.
గత రెండు, మూడేండ్లుగా 22ఏ (నిషేధిత జాబితా) పేరిట జరిగిన భూ అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో భూదోపిడీకి కారణమైన ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు భూ భారతి పేరుతో అంతకంటే పెద్ద స్కామ్కు తెరలేపిందని ఆరోపించారు.
కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల ప్రైవేటు భూములను రాత్రికి రాత్రే అక్రమంగా 22ఏ జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా నివాసముంటూ, పన్నులు కడుతున్న సామాన్యుల స్థలాలను కూడా నిషేధిత జాబితాలో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలంటే 50 శాతం వాటాలు, భారీగా లంచాలు డిమాండ్ చేస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే ఇక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బాధితులకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కేంద్రం 70 శాతానికి పైగా సబ్సిడీ ఇస్తూ పేదలకు ఉచిత బియ్యం అందిస్తుంటే.. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో, కేంద్ర లోగోను తొలగించడం సిగ్గుచేటని విమర్శించారు.
కేంద్రం వాటా ఉన్నప్పుడు లోగో ఎందుకు వేయడం లేదని.. కేవలం సీఎం, పౌరసరఫరాల మంత్రి ఫొటోలే ముద్రించుకుంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే కేంద్రమే నేరుగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసే ఏర్పాట్లను పరిశీలిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్లో ముక్తి దివస్
నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుడు షోయబుల్లా ఖాన్కు కిషన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. మజ్లిస్ పార్టీకి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను మరుగున పడేయాలని చూస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితా శుద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, హైదరాబాద్లో ఓట్లు తగ్గడానికి సీఎం వ్యాఖ్యలే కారణమని పేర్కొన్నారు.
