
- ముందు నోటీసులు.. వినకపోతే సీజ్
- ఎర్ర రిబ్బన్ చుట్టి అధికారుల సంతకాలతో ట్యాగ్
- రిబ్బన్ కట్లు కలిసే చోట బల్దియా ముద్ర
- స్పెషల్ ప్రోటోకాల్ రిలీజ్ చేసిన బల్దియా కమిషనర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలపై బల్దియా మరింత కఠినంగా వ్యవహరించనుంది. రూల్స్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై కొరఢా ఝులిపించనున్నది. అందుకు సంబంధించి నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఇందులో భాగంగా బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పెషల్ప్రోటోకాల్ సోమవారం రిలీజ్చేశారు.
నగరంలో గుర్తించిన అనధికార భవనాలను సీజ్ చేయడం, తిరిగి తెరవడంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేశారు. మార్చిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఆఫీసర్బిల్డింగ్సీజ్చేస్తే అతడు కాకుండా.. పై స్థాయి అధికారికి మాత్రమే సీజ్చేసిన ముద్రలను తొలగించే అధికారాన్నిచ్చారు. ఉదాహరణకు డిప్యూటీ కమిషనర్ సీజ్ చేస్తే, జోనల్ కమిషనర్, జోనల్ కమిషనర్ సీజ్ చేస్తే జీహెచ్ఎంసీ కమిషనర్ కు సీజ్ తొలగించాలి.
మూడు సందర్భాల్లో సీజ్..
టీజీబీపాస్ యాక్ట్, కోర్టు ఆదేశాల ప్రకారం రెండు సందర్భాల్లో భవనాలను సీజ్ చేయవచ్చు. బిల్డింగ్పర్మిషన్కోసం తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినప్పుడు, పర్మిషన్లేకుండా లేదా ఆమోదించిన ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినప్పుడు సీజ్చేయొచ్చు. డిసెంబర్ 2024న సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈ ప్రక్రియలో పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దాని ప్రకారం షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత కూడా నిర్మాణం కొనసాగిస్తే తక్షణమే సీజ్ చేస్తారు.
ప్రక్రియ ఇలా..
అక్రమ నిర్మాణానికి సంబంధించి ఒకసారి నోటీసు జారీ చేసిన తర్వాత కలెక్టర్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ జోనల్ కమిషనర్ లేదా నియమించిన నోడల్ ఆఫీసర్కు సమాచారాన్ని పంపించి, నిర్మాణంపై స్పష్టంగా నోటీసు అంటించాలి. నిర్మాణాన్ని ఆపకపోతే మూడు రోజుల్లో సీజ్ చేయాలి. నిర్మాణం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్ కట్టాలి. అధికారుల సంతకాలతో కూడిన ట్యాగ్ జత చేసి, రిబ్బన్ కట్లు ఎక్కడ కలుస్తాయో అక్కడ మెమోతో బల్దియా ముద్ర వేయాలి. ప్రతి ఎంట్రన్స్, ఎగ్జిట్మెట్లు, లిఫ్ట్లు, ర్యాంపులు మొదలైన వాటిని ప్లైవుడ్ లేదా బోర్డులతో మూసెయ్యాలి. తాళాలు వాడే అవకాశం ఉంటే, వాటిని దుస్తులతో కప్పి, మెమోతో స్టాంప్వేయాలి.