హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు తగ్గిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై హైదరాబాద్కు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ హుస్సేని దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై (పిల్) సోమవారం చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు తగ్గాయని చెప్పారు. ఆ రెండు సీట్లలో ఒకటి ఎమ్మెల్యేల కోటాకు, మరోటి మున్సిపాలిటీల కోటాకు వెళ్లాయని తెలిపారు. దీంతో శాసనమండలిలో ఉండాల్సిన సమతుల్యత దెబ్బతిందని పేర్కొన్నారు.
