11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ

11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ
  • నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • తొలిసారి 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు భర్తీ
  • ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు
  • గతంలో అప్లై చేసుకున్నోళ్లు మళ్లీ చేయక్కర్లేదు 
  • అత్యధికంగా హైదరాబాద్​లో 878, 
  • అత్యల్పంగా పెద్దపల్లిలో 93 పోస్టులు
  • మొదటిసారి ఆన్​లైన్​లో పరీక్షలు.. 
  • జూన్ నెలాఖరులో పెట్టే చాన్స్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ను గురువారం తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్​జీటీ, పీఈటీ, లాంగ్వేజీ పండిట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటితో పాటు తొలిసారిగా స్పెషల్ టీచర్ పోస్టులనూ భర్తీ చేస్తున్నది. స్పెషల్ టీచర్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ 220, ఎస్​జీటీ పోస్టులు 796 ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ హారిజెంటల్ విధానంలోనే భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ నెల 4 నుంచి డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఫీజు చెల్లింపు మాత్రం ఏప్రిల్ 2లోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును గతంలో మాదిరిగానే రూ.వెయ్యి నిర్ణయించారు. అయితే గతేడాది డీఎస్సీకి అప్లై చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. 5,089 పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. దాన్ని రెండ్రోజుల కింద ప్రభుత్వం రద్దు చేసింది. అప్పుడు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లంతా ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాగా, డీఎస్సీ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఎగ్జామ్స్ జూన్ నెలాఖరులో నిర్వహించే అవకాశం ఉంది. 

వయోపరిమితి 46 ఏండ్లు..

డీఎస్సీకి  దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు పెంచారు. 18 ఏండ్ల నుంచి 46 ఏండ్ల వరకు ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టులకు అర్హులేనని సర్కార్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేండ్లు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు రెగ్యులర్ సర్వీస్ కాలంపై ఆధారపడి ఐదేండ్ల వరకు సడలింపు ఇచ్చారు.  

11 కేంద్రాల్లో ఎగ్జామ్స్..

డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (సీబీఆర్​టీ) విధానంలో ఆన్​లైన్​లో నిర్వహించనున్నట్టు సర్కార్ ప్రకటించింది. మహబూబ్‌‌నగర్‌‌, రంగారెడ్డి, హైదరాబాద్‌‌, మెదక్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌, కరీంనగర్‌‌, వరంగల్‌‌, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జిల్లాల వారీగా కమ్యూనిటీ, మీడియం వారీగా ఖాళీల వివరాలతో ఇన్ఫర్మేషన్ బులెటిన్​రూపొందిస్తామని.. దాన్ని ఈ నెల4న www.schooledu.telangana.gov.in వెబ్ సైట్​లో పెడ్తామని పేర్కొంది. 

అన్ని జిల్లాల్లో వందకు పైనే.. 

డీఎస్సీ ద్వారా 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా హైదరాబాద్​లో 878 పోస్టులు ఉండగా, అత్యల్పంగా పెద్దపల్లిలో 93 పోస్టులు ఉన్నాయి. ఒక్క పెద్దపల్లి మినహా అన్ని జిల్లాల్లోనూ వందకు పైగానే పోస్టులు ఉన్నాయి. 26 జిల్లాల్లో 200కు పైగానే ఉన్నాయి. హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి,  నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఎస్​జీటీ పోస్టులు భారీగా పెరిగాయి. 

స్వరాష్ట్రంలో పెద్ద నోటిఫికేషన్.. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే అతిపెద్ద టీచర్​నోటిఫికేషన్. తొలిసారిగా 2017లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ 8,792 పోస్టుల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే వివిధ కారణాలతో అన్ని పోస్టులను భర్తీ చేయలేకపోయారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు గతేడాది 5,089 పోస్టులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఎన్నికల పేరుతో రిక్రూట్ మెంట్ ను వాయిదా వేసింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏకంగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది.   

టీచర్ సంఘాల హర్షం..  

టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్​రావు, టీపీటీఎఫ్ అడిషనల్ జనరల్ సెక్రటరీ రవీందర్ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. 11వేల మంది కొత్త టీచర్లు రానుండడంతో సబ్జెక్టు టీచర్ల కొరత తీరుతుందని అన్నారు. తద్వారా విద్యారంగం బలోపేతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.