మిథనాల్ తయారీ ఏమాయె?..ఆరు నెలల కింద ట్రయల్ రన్ సక్సెస్

మిథనాల్ తయారీ ఏమాయె?..ఆరు నెలల కింద ట్రయల్ రన్ సక్సెస్
  • రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ విభాగానికి నివేదిక
  • అనుమతులు రాకపోవడంతో జైపూర్​ ఎస్టీపీసీ ప్లాంట్​లో ప్రారంభం కాని ఉత్పత్తి

కోల్​బెల్ట్/ జైపూర్, వెలుగు:మంచిర్యాల జిల్లా జైపూర్​ సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్(ఎస్టీపీపీ) ఆవరణలో కార్బన్  డయాక్సైడ్​ నుంచి మిథనాల్​ను తయారు చేసే పైలట్​ ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభం కావడం లేదు. ప్లాంట్​లో ప్రయోగాత్మకంగా మిథనాల్​ ఉత్పత్తి ట్రయల్​ రన్​ సక్సెస్​ అయినప్పటికీ, పూర్తి స్థాయి నిర్వహణపై సింగరేణి యాజమాన్యం వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది. 

రూ.20కోట్లతో నిర్మించిన ప్లాంట్​ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిథనాల్​ ఉత్పత్తికి సంబంధించిన నివేదికలను రీసెర్చ్  అండ్​ డెవలప్​మెంట్​ విభాగానికి పంపించి ఆరు నెలలు దాటుతున్నా, అక్కడి నుంచి ఏ సమాచారం రాకపోవడంతో ఎదురుచూపులు తప్పడంలేదు. 

దేశంలో తొలి పైలట్​ ప్రాజెక్టుగా..

సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గును మండించడం ద్వారా వెలువడే కార్బన్​ డయాక్సైడ్​ ఆధారంగా మిథనాల్  లిక్విడ్​ను తయారుచేసేందుకు సింగరేణి యాజమాన్యం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2021లో ప్రపోజల్స్​ తయారు చేయగా, అనేకసార్లు రివ్యూ చేసిన అనంతరం 2024 నవంబర్ లో​ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. కోలిండియా ఆధ్వర్యంలో సెంట్రల్​ మైన్​ ప్లానింగ్​ అండ్​ డిజైన్​ ఇనిస్టిట్యూట్(సీఎంపీడీఐ) ఆర్థిక సహకారంతో రూ.20 కోట్ల అంచనాతో ఎస్టీపీపీలో ప్లాంట్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

కోలిండియా పరిధిలో పలు రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి సంస్థలు ఉన్నా, వీటిలో ఎస్టీపీపీ మాదిరిగా విద్యుత్​ ఉత్పత్తి చేసే సంస్థలు లేకపోవడంతో సింగరేణిలోని ఎస్టీపీపీని ప్రయోగానికి ఎంచుకున్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్న 120 మిలియన్​ టన్నుల మిథనాల్​లో 80 మిలియన్​ టన్నుల వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 

కార్బన్​ డయాక్సైడ్​ ఆధారంగా..

సింగరేణి ఎస్టీపీపీలో బొగ్గును మండించడం ద్వారా వెలువడే కార్బన్​ డయాక్సైడ్​ వాయువు ఆధారంగా మిథనాల్  ఉత్పత్తి​ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. బొగ్గును మండించే సమయంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రోస్టాటిక్​ ప్రెసిపిటేటర్స్(ఈఎస్​పీ)ను నెలకొల్పారు. దీంతో వాతావరణం కలుషితం కాకుండా చర్యలు చేపట్టారు. 

ఇందుకోసం ఎస్టీపీపీ చిమ్నీకి అనుబంధంగా ప్లాంట్​ను నిర్మించారు. ఈ విధానం ద్వారా ఉత్పత్తి అయ్యే కార్బన్​ డయాక్సైడ్​తో 150 నుంచి 180 కేజీల మిథనాల్​ తయారు చేసే అవకాశం ఉంది. 

బెంగుళూరు సంస్థకు బాధ్యతలు

సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​లో ఏర్పాటు చేసిన మిథనాల్  ప్లాంట్​ నిర్వహణ, మిథనాల్​ ఉత్పత్తి తదితర బాధ్యతలను బెంగుళూరుకు చెందిన జవహర్​లాల్​ నెహ్రూ సెంటర్​ ఫర్​ అడ్వాన్స్​డ్​ సైంటిఫిక్​ రీసెర్చ్  అండ్  అప్లైడ్​ సైన్సెస్​ ప్రైవేట్​ లిమిటెడ్(జేఎన్​సీఏఎస్​ఆర్)కు అప్పగించారు. 2024లో ప్లాంట్​ పనులు పూర్తి కాగా, 2025 మార్చితో పాటు అదే ఏడాది అక్టోబర్​ నుంచి 2026 ఫిబ్రవరి వరకు పలు దశల్లో ప్రయోగాత్మకంగా మిథనాల్​ను ఉత్పత్తి చేశారు. 

ఇందులో లోపాలను గుర్తించి టార్గెట్​ మేరకు ఉత్పత్తి సాధించే దిశగా చర్యలు చేపట్టారు. కార్బన్​ డై ఆక్సైడ్​ సేకరణ, హైడ్రోజన్​ ఉత్పత్తి, కంప్రెషన్, మిథనాల్​ డిస్టిలేషన్​కు సంబంధించిన కొన్ని కీలక యంత్రాల విడిభాగాలు ఆలస్యంగా రావడంతో ప్లాంట్  పనుల్లో జాప్యం జరిగింది. 

ప్రస్తుతం  ప్లాంట్​లో మిథనాల్​ ఉత్పత్తి ట్రయల్​ రన్​ సక్సెస్​ కావడంతో నివేదికలను రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ విభాగానికి పంపారు. ఆరు నెలలు గడుస్తున్నా ప్లాంట్​ పూర్తి స్థాయి నిర్వహణకు ఆదేశాలు రాలేదు. దీంతో ఎదురుచూపులు  తప్పడం లేదు.

సింగరేణికి ప్రయోజనం

మిథనాల్​ను ఎరువులు, అక్రిలిక్​ ప్లాస్టిక్, సింథటిక్​ ఫైబర్​ వస్త్రాలు, ఫ్లైవుడ్, పెయింట్స్  తయారీలో వినియోగిస్తారు. ప్లాంట్​లో తయారు చేసే మిథనాల్​ను వివిధ పరిశ్రమలకు అమ్మడం ద్వారా సింగరేణికి ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం మార్కెట్​లో మిథనాల్​ స్వచ్ఛతను బట్టి కేజీకి రూ.200 నుంచి 300 వరకు పలుకుతోంది. ఎస్టీపీపీ ప్లాంట్​ ద్వారా మిథనాల్​ ఉత్పత్తి జరిగితే సింగరేణికి వ్యాపారపరంగా కలిసివస్తుందని చెబుతున్నారు.