న్యూఢిల్లీ, వెలుగు: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ అబ్జర్వర్గా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను నియమించింది.
పొన్నంతో పాటు కర్నాటక మాజీ మంత్రి దినేష్ గుండూరావుకు కూడా ఏఐసీసీ ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పుదుచ్చేరిలో ఎన్నికల వ్యూహరచన, పార్టీ సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించేందుకు వీరిద్దరిని నియమించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
