నిజామాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరిగాయి.. క్షమించమని కేటీఆర్ అంటున్నాడని, క్షమించమనగానే వాళ్ల అవినీతి, అరాచకాలను ప్రజలు మరిచిపోతారా? అని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్ ప్రజలను దగా చేశారన్నారు.
మంగళవారం నిజామాబాద్ డీసీసీ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం డిజైన్ మార్చి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే చుక్కనీరు రాలేదని మండిపడ్డారు. కాళేశ్వరానికి అంతా తానే అని కేసీఆర్ చెప్పుకున్నారని, ఆయన పాలనలో కూలిపోతే ఇప్పుడు నాకేం సంబంధం అని ఎట్లంటడని ప్రశ్నించారు.
మేడిగడ్డ వైఫల్యంలో అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్రావు రోల్ లేదా? అని నిలదీశారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రెడీగా ఉన్నామన్నారు. 56 ఇంచుల ఛాతీ గల ప్రధాని మోదీ నీట్ ఎగ్జామ్ను కూడా సరిగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నాడని విమర్శించారు. పేపర్ లీక్ వల్ల స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారని, న్యాయం కోసం విద్యార్థులు ఢిల్లీ రోడ్ల మీదకొస్తే ఆడమగ తేడా లేకుండా పోలీసులతో చితక్కొట్టించారని మండిపడ్డారు.
నీట్ లీక్కు బాధ్యుడైన సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలేదని, ప్రధాని ఆయన్ను తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ పేరుతో పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, తెలంగాణలో వారి కుట్రలను అడ్డుకుంటున్నామన్నారు.
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు ఉన్నారు. నగర కార్పొరేషన్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ ఇలాత్రిపాఠి, మేయర్ ఉమారాణితో కలిసి కలెక్టరేట్లో రివ్యూ చేశారు.
