
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. 4013 ఫోన్ నంబర్లను మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఫోన్ ట్యాపింగ్ బాధితులు 618 మంది ఉండగా.. ఇందులో పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారు.
618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు కూడా ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, మాజీ ఎమ్మెల్యే KS రత్నం , మర్రి శశిధర్ రెడ్డి, BRS నేతలు, మాజీ ఎమ్మెల్యే లు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్యలకు నోటీస్ ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఐఏఎస్లు రోనాల్డ్ రాస్, గౌతంల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవడం గమనార్హం. పోలీసులు ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రణీత్ రావు నేడు(బుధవారం) మరో సారి సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు సిట్కు తెలిపిన వివరాల మేరకు.. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావును మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా నియమించారు. ఆ తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ (ఎస్వోటీ) టీమ్ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రణీత్ రావు చీఫ్గా పని చేశారు.
బీఆర్ఎస్ సర్కార్కు వ్యతిరేకంగా పనిచేసే సొంత పార్టీ నేతలు సహా కాంగ్రెస్, బీజేపీ, వ్యాపారవేత్తలు, పౌరహక్కుల నేతలు చివరకు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారు. బేగంపేట్లోని ఎస్ఐబీ ఆఫీస్ కేంద్రంగా ఎస్వోటీకి ప్రత్యేక గదులు కేటాయించారు. కేసీఆర్, సీఎంవో, ప్రభాకర్ రావు అందించిన వివరాలతో ప్రణీత్ రావు సుమారు 4,200కి పైగా ఫోన్ నంబర్లతో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు.