- అంతర్జాతీయ హంగులతో ఇయ్యాల, రేపు సమిట్.. ముస్తాబైన ఫ్యూచర్ సిటీ
- రాష్ట్రానికి లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం
- మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించనున్న గవర్నర్
- అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖుల ప్రసంగాలు
- హాజరుకానున్న 44 దేశాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు
- రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
- ప్రత్యేక ఆకర్షణగా ‘మూసీ పునరుజ్జీవం’ స్టాల్
- కొమ్ముకోయ, ఒగ్గుడోలు, పేరిణి శివతాండవం ప్రదర్శనలు
- నోరూరించనున్న హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చిపులుసు
- అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు.. పోచంపల్లి ఇక్కత్ శాలువాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సుకు అధికార యంత్రాంగం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 2047 నాటికి రాష్ట్రాన్ని గ్లోబల్ పవర్ హౌస్గా మార్చాలన్న విజన్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అత్యంత ఆధునిక హంగులతో కూడిన వేదికలు, డిజిటల్ టన్నెళ్లు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు అతిథులకు స్వాగతం పలకనున్నాయి. రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించడమే ప్రధాన అజెండాగా ఈ సమిట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు మూడు వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. సోమవారం మధ్యాహ్నం 1. 30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమిట్ను ప్రారంభిస్తారు. అనంతరం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు.
లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు..!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 44 దేశాలకు చెందిన 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్నారు. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధుల బృందం హాజరుకానున్నారు. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి తేవడమే లక్ష్యంగా ఈ సమిట్ సాగనుంది. సమిట్లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి ప్రముఖులు ప్రసంగిస్తారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా తమ సందేశాన్ని వినిపించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘మూసీ పునరుజ్జీవనం’ స్టాల్
సమిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకర్షించనున్నాయి. ముఖ్యంగా ‘మూసీ పునరుజ్జీవనం’పై ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మూసీ నది ప్రక్షాళన తర్వాత రివర్ ఫ్రంట్ ఎలా ఉండబోతున్నది? అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నదీ తీరాన్ని ఎలా తీర్చిదిద్దనున్నారు? పరీవాహక ప్రాంతాల అభివృద్ధి ఎలా జరుగుతుంది?.. అనే విషయాలను ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కండ్లకు కట్టినట్లు వివరించనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక గైడ్లను నియమించారు. ఇతర దేశాల్లో నదీ తీరాల అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టు వివరాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు.
భద్రత నుంచి సంస్కృతి వరకు.. విభిన్న స్టాల్స్
తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన ‘సైబర్ సేఫ్ తెలంగాణ’ స్టాల్లో అధునాతన సాంకేతికత, కమాండ్ కంట్రోల్ పనితీరు, 1930 హెల్ప్లైన్, డార్క్ వెబ్ నియంత్రణ వంటి అంశాలను ప్రదర్శించనున్నారు. అలాగే మహిళా సాధికారత, గ్రామీణ ఉత్పత్తులకు పెద్దపీట వేస్తూ ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంత గిరిజనుల సంస్కృతికి అద్దం పట్టేలా ‘కోయ బొమ్మల’ స్టాల్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. చెక్కతో చేసిన ఈ కళాకృతులు, ఆదివాసీల జీవన విధానం, వారు తయారు చేసే సహజ సిద్ధమైన ఉత్పత్తులను విదేశీ ప్రతినిధులకు పరిచయం చేయనున్నారు.
జ్ఞాపికగా కరీంనగర్ ఫిలిగ్రీ
సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే జ్ఞాపికలు అత్యంత విలువైనవిగా నిలవనున్నాయి. కరీంనగర్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ‘సిల్వర్ ఫిలిగ్రీ’ కళాఖండాలను బహుమతిగా ఇవ్వనున్నారు. ధ్యాన ముద్రలో ఉన్న గౌతమ బుద్ధుని వెండి ప్రతిమను ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించారు. సుమారు 100 మంది కళాకారులు, 10 రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దారు. సన్నని వెండి తీగలతో అల్లిన ఈ కళాకృతులు విదేశీ అతిథులకు అందించనున్నారు. ఇక.. బహుమతుల బుట్టలో సిల్వర్ ఫిలిగ్రీతో పాటు తెలంగాణ చేనేత వైభవానికి ప్రతీకలైన పోచంపల్లి ఇక్కత్ శాలువాలు, చేర్యాల పెయింటింగ్స్, ప్రసిద్ధ హైదరాబాదీ అత్తర్, ముత్యాల ఆభరణాలను పొందుపరిచారు. వీటితో పాటు నోరూరించే తెలంగాణ పిండివంటలైన సకినాలు, చెక్కలు, ఇప్పపువ్వు లడ్డు, నువ్వుల ఉండలు, బాదం-కీ-జాలి, మక్క పేలాలతో కూడిన ప్రత్యేక బాస్కెట్ను కూడా అతిథులకు అందజేయనున్నారు.
ఒగ్గుడోలు, పేరిణి శివతాండవం ప్రదర్శన
సబ్జెక్టులపై చర్చల తర్వాత విదేశీ అతిథులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి ఆధ్వర్యంలో సంగీత విభావరి అతిథులను అలరించనుంది. అలాగే తెలంగాణ మట్టి వాసనలు వెదజల్లేలా కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డోలు, పేరిణి శివతాండవం వంటి నృత్య ప్రదర్శనలు ఉంటాయి. బోనాల జాతర వైభవాన్ని కండ్లకు కట్టేలా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతినిధులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని అధికారులు చెప్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత.. ముగింపులో డ్రోన్ షో
అతిథుల భద్రత విషయంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సుమారు 2,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువునా నిఘా ఉంచేందుకు 1,000కి పైగా సీసీ కెమెరాలను అమర్చారు. మహిళా ప్రతినిధుల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్, ఉమెన్ వింగ్స్ను రంగంలోకి దించారు. సదస్సు ముగింపు రోజైన డిసెంబర్ 9న సాయంత్రం కన్నుల పండువగా డ్రోన్ షో నిర్వహించనున్నారు. వేలాది డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ అభివృద్ధి చిత్రాలను, విజన్ 2047 లక్ష్యాలను ఆవిష్కరించనున్నారు.
డిజిటల్ టన్నెల్, ఎల్ఈడీ వెలుగులు
సమిట్ ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ‘డిజిటల్ టన్నెల్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో నడుచుకుంటూ వెళ్తుంటే ఇరువైపులా ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లపై రామప్ప దేవాలయం, కాకతీయ కళాతోరణం, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాల విజువల్స్ కనిపిస్తాయి. మెయిన్ హాల్ వేదికపై ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం, మరోవైపు భారీ ఎల్ఈడీ స్క్రీన్లతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సదస్సు ప్రాంగణమంతా పచ్చదనంతో కళకళలాడేలా పూల మొక్కలతో ‘తెలంగాణ రైజింగ్’ అక్షరాలను రాశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ బిర్యానీ.. సర్వపిండి.. పచ్చిపులుసు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు వచ్చే అతిథులకు రెండు రోజులూ ఘుమఘుమలాడే పసందైన హైదరాబాద్ బిర్యానీతో పాటు తెలంగాణ రుచులను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సర్వపిండి, పచ్చిపులుసు వంటి సంప్రదాయ వంటకాలతో పాటు స్థానిక మిల్లెట్స్ తో చేసిన ఆహార పదార్థాలను అందించనున్నారు. ఇందుకోసం భారీ వంటశాలలను ఏర్పాటు చేశారు.
నాలుగుహాళ్లు.. 27 సెషన్లు
సమిట్ జరిగే రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన హాల్తో పాటు మరో మూడు ప్రత్యేక సెమినార్ హాల్స్ను అధికారులు రెడీ చేశారు. ఒకే సమయంలో నాలుగు వేర్వేరు అంశాలపై చర్చలు జరిగేలా ప్రణాళిక రూపొందించారు.
మొదటి రోజు సోమవారం ‘ది జస్ట్ ట్రాన్సిషన్ ఇన్ టు 2047’, ‘గ్రీన్ మొబిలిటీ’, ‘జీరో ఎమిషన్ వెహికల్స్’, ‘టెక్ తెలంగాణ-సెమీకండక్టర్స్’, ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్’ వంటి కీలక అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్ టూరిజం, కొరియా-ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.
సదస్సు రెండో రోజైన మంగళవారం కూడా అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ‘జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్’, ‘లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్’ వంటి అంశాలతో పాటు, తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడం ఎలా అనే అంశంపై నిపుణులు దిశానిర్దేశం చేయనున్నారు. పట్టణ-గ్రామీణ అనుసంధానం, అందరికీ అందుబాటులో గృహనిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 వంటి అంశాలపై విశ్లేషణలు ఉంటాయి. సాయంత్రం స్టార్టప్స్, సృజనాత్మక రంగం, వినోద రంగం భవిష్యత్తుపై చర్చా గోష్ఠులు జరుగుతాయి. చివరిగా విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరిస్తారు.
