
- వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ప్రమాదం
- నారాయణ పేట జిల్లాలో లారీని ఢీకొట్టిన బస్సు, 18 మందికి గాయాలు
- కరీంనగర్ జిల్లాలో బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, భార్యాభర్తలు మృతి
పర్వతగిరి (గీసుకొండ), వెలుగు : టైరు పేలడంతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టగా ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వసంతాపురం శివారులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ ఎల్బీనగర్కు చెందిన ఎండీ.షోయబుద్దీన్ (17), చింతల్కు చెందిన షేక్ మహ్మద్ (18) మరో ఇద్దరితో కలిసి గురువారం సాయంత్రం సంగెం మండలం కోట వెంకటాపూర్ గ్రామం నుంచి వసంతాపూర్ వైపు వెళ్తున్నారు.
గ్రామ శివారులోకి రాగానే ఒక్కసారిగా కారు వెనుక టైరు పేలడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో షోయబుద్దీన్, షేక్ మహ్మద్ అక్కడికక్కడే చనిపోగా మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న గీసుకొండ సీఐ మహేందర్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని ఎంజీఎంకు తరలించారు.
లారీని ఢీకొట్టిన బస్సు, 18 మందికి గాయాలు
మక్తల్, వెలుగు : ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ బస్సు ఢీక్టొటడంతో 18 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొందలకుంట గ్రామ స్టేజీ వద్ద హైవేపై గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీదుర్గాంబ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు30 మంది ప్రయాణికులతో కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ నుంచి హైదరాబాద్కు వస్తోంది.
ఈ క్రమంలో బొందలకుంట సమీపంలోకి రాగానే హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 18 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని రాయచూర్, మహబూబ్నగర్ హాస్పిటల్కు తరలించారు. ఎస్పీ యోగేశ్ గౌతమ్ ప్రమాదస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
శంకరపట్నం, వెలుగు : బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో దంపతులు చనిపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ శివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండలం బొంతుపల్లికి చెందిన తాటికొండ రామస్వామి (68), పుష్పలీల (65) దంపతులు గురువారం బైక్పై హుజూరాబాద్ వెళ్తున్నారు.
కాచాపూర్ ఎక్స్రోడ్డు ఆముదాలపల్లి రోడ్డు మూలమలుపు వద్దకు రాగనే బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో పుష్పలీల అక్కడికక్కడే చనిపోగా, రామస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో హాస్పిటల్కు తరలించగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు.