
సెక్రటేరియెట్ షిఫ్టింగ్, బీఆర్కే భవన్ మరమ్మతులు జరుగుతుండడంతో కొందరు ఉన్నతాధికారులు ఇంటి దగ్గర్నుంచే పని చేయనున్నారు. ఆర్థిక శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల, రెవెన్యూ, ఎక్సైజ్ తదితర శాఖల ముఖ్య కార్యదర్శుల (ప్రిన్సిపల్ సెక్రటరీ–పీఎస్) పనులకు ఆటంకం కలగకుండా సీఎస్ ఎస్కే జోషి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకూ సీఎస్సూచించారు. మరికొద్ది రోజుల్లో బడ్జెట్ పెట్టబోతున్న నేపథ్యంలో, ప్రతిపాదనలు పంపాల్సిందిగా అన్ని శాఖలకు ఇటీవల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులిచ్చారు. అయితే, సెక్రటేరియెట్, బీఆర్కే భవన్లో డ్యూటీ చేయలేని కారణంగా వర్క్ ఫ్రం హోం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
సీఎస్ జోషి కూడా కొన్ని రోజలు కుందన్బాగ్లోని ఇంటి నుంచే పనిచేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే సమీక్షలు చేయనున్నారు. కాగా, వరుస సెలవులతో సెక్రటేరియెట్ షిఫ్టింగ్ పనుల్లో వేగం కాస్త తగ్గింది. శనివారం జీఏడీలోని పలు ఫైళ్లు, ఫర్నీచర్ను సర్దిపెట్టారు. ఎక్కువ సామాను ఉండడంతో జీఏడీ, సీఎస్ పేషీల షిఫ్టింగ్కు ఇంకొంత సమయం పడుతుందని అంటున్నారు. బీఆర్కే భవన్కు రిపేర్లు పూర్తి చేసేందుకు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశముంది. ఇప్పుడు పెయింటింగ్తో పాటు వివిధ శాఖల క్యాబిన్లలో ఫ్యాన్లు, లైట్లు పెడుతున్నారు. భవన్ ఎంట్రెన్స్ దగ్గర స్కానర్లు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. అన్ని మరమ్మతులు పూర్తయిన తర్వాతే టెలిఫోన్, ఇంటర్నెట్, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటర్కామ్, డేటా సెంటర్, సర్వర్ రూంలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి బీఆర్కే భవన్లో పూర్తి స్థాయిలో పాలన సాగుతుందని చెబుతున్నారు.
అంబాసిడర్ కార్లను ఎం చేస్తారు?
అంబాసిడర్ కార్లు.. అప్పట్లో ప్రభుత్వం వాడిన కార్లవి. సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు వాటిని వాడారు. కాలం మారడం, టెక్నాలజీ పెరగడంతో కార్లూ మారిపోయాయి. కొత్తవి వచ్చాయి. వాటిని మూలకు పడేశారు. అవిప్పుడు సెక్రటేరియెట్ క్యాంటీన్ సమీపంలో తుప్పు పట్టిపోతున్నాయి. ఆ కార్లను ఉన్నతాధికారులు ఏం చేస్తారన్నదానిపై స్పష్టత రావట్లేదు. 100 కార్ల దాకా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా కార్లకు ఫ్యాన్సీ నంబర్లున్నాయి. ఉదాహరణకు 2345, 8888, 6666, 5678, 2727, 3277 నంబర్లున్నాయి వాటికి. కొన్ని కార్ల పై ఏపీ జ్యడీషియల్ అకాడమీ, ఏపీ హైకోర్టు అని స్టిక్కర్లు ఉన్నాయి. విభజన తర్వాత అవి ఏపీ అధీనంలో ఉండేవని సెక్రటేరియట్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఏపీ అధికారులు బ్లాకులు అప్పగించి ఫర్నీచర్, సామగ్రి, ఫైళ్లు ఇతర వస్తువులను అమరావతికి తీసుకెళ్లిపోయారు. కార్లను మాత్రం పట్టించుకోలేదు. దీంతో అవి తుప్పుపట్టాయి. కొద్ది రోజుల్లో సెక్రటేరియెట్ను కూల్చబోతున్న నేపథ్యంలో, ఏపీ అధికారులకు లేఖ రాయాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.