ఖైరతాబాద్ లో చిన్నారిపై వీధి కుక్క దాడి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. దినపత్రికల్లో వచ్చిన న్యూస్ ఆధారంగా కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది కమిషన్. చిన్నారిని తీవ్రంగా గాయపరిచిన ఘటనపై విచారణకు ఆదేశించారు కమిషన్ జ్యుడీషియల్ సభ్యులు శివాడి ప్రవీణ . ఈ దాడి పిల్లల భద్రత , జీవించే హక్కును పరిగణలోకి తీసుకుంది కమిషన్. జీహెచ్ఎంసి పరిధిలో వీధి కుక్కల దాడులు , వాటి నియంత్రణకు తీసుకున్న చర్యలపై నివేదికను కోరింది కమిషన్ . ఫిబ్రవరి 24లోగా నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసి కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది కమిషన్ .
జనవరి 27న ఖైరతాబాద్ బడా గణేష్ వెనుక శ్రీనివాస్ నగర్లో ఓ చిన్నారిపై కుక్కల దాడిలో చిన్నారి గాయపడిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఇంటి ముందు అడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. ప్రస్తుతం బంజారాహిల్స్లోని రెయిన్ బో ఆసుపత్రిలో చిన్నారి శార్వికి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి యూకేజీ చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు.
►ALSO READ | కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ నగరంలో చాలా కాలనీల్లో రాత్రయితే చాలు కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతూ కనిపించిన వారిపై మూకుమ్మడిగా వేటాడి కరుస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని జంక్షన్లు, మురుగు కాలువలు, చెత్తకుప్పల వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్లే వారిని వదలకుండా దాడులు చేస్తున్నాయి.కుక్కల దాడుల్లో అనేకమంది చిన్నారులు, మహిళలు గాయాలపాలవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. బైక్లపై వెళ్లే వారి వెంట బడడంతో అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి.
