
- సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫొటోలు, ఫోన్ నంబర్ల సేకరణ
- ఎమర్జెన్సీ పేరుతో మెసేజ్లు, మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్
- గత 4 నెలల్లో 317 కేసులు నమోదు
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో ఫేక్ డిస్ ప్లే పిక్చర్స్ (డీపీ) డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఫేక్ డీపీలు, నకిలీ ప్రొఫైల్స్తో జరుగుతున్న మోసాలు ఏటా పెరిగిపోతున్నాయి. నకిలీ ప్రొఫైల్స్తో నిరుడు మొత్తం 5,155 మంది బాధితులుగా మారారు. వారిలో అత్యధికంగా 868 మంది వ్యాపారవేత్తలు, 589 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ సెక్టార్లకు చెందిన 3,037 మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 317 కేసులు నమోదయ్యాయి. ఇలా ఏటా సుమారు 5 వేల మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు, పోకిరీలు వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, స్కైప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వ్యక్తుల ఫొటోలను సేకరించి మార్ఫింగ్ చేస్తున్నారు. వీటితో ఫేక్ డీపీలు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
ఆన్లైన్లో తమకు కావాల్సిన సమాచారం, ఫొటోలను సేకరిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో ఫేక్ ప్రొఫైల్స్తో ప్రవేశిస్తున్నారు. తమను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసేలా హైప్రొఫైల్తో రిక్వెస్టులు పంపుతున్నారు. ఇలాంటి రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేసి తమ అకౌంట్లలో యాడ్ చేసుకున్నవారి గ్రూపులోని కాంటాక్టులను కేటుగాళ్లు పరిశీలిస్తున్నారు. గ్రూపుల్లో పోస్టింగ్స్ చేసే వారి ప్రొఫైల్స్తో పాటు వారి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సహా వ్యాపార వ్యవహారాలను తెలుసుకుంటున్నారు. వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పొలిటీషియన్లతో పాటు బిజీ షెడ్యూల్తో ఉండే వారిని గుమనిస్తున్నారు.
ఈక్రమంలోనే ఆయా గ్రూపుల్లో ఉన్న వారి ఫొటోలతో పాటు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన ఫోన్ నంబర్లను ట్రూ కాలర్తో పరిశీలిస్తున్నారు. ఆయా ఫోన్ నంబర్లతో ఉన్న కాంటాక్ట్కు వాట్సాప్ డీపీగా తాము సేకరించిన ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. తరువాత తాము టార్గెట్ చేసిన వ్యక్తికి తెలిసిన వారి పేరుతో వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు. తాము హాస్పిటల్లో ఉన్నామని, అత్యవసరంగా డబ్బులు కావాలని, తన గూగుల్ పే పనిచేయడం లేదని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నారు.
ట్రూ కాలర్తో మరో కొత్త స్కెచ్
సోషల్ మీడియాలో ఫొటోలు, ట్రూ కాలర్లో మహిళల పేర్లు కనిపిస్తే చాలు ట్రాప్ చేసేందుకు కేటుగాళ్లు స్కెచ్ వేస్తున్నారు. ఆయా ఫోన్ నంబర్లను సేవ్ చేసుకుంటున్నారు. వారి వాట్సాప్ డీపీని కాపీ చేసుకుని మార్ఫింగ్ చేస్తున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను బాధిత యువతులకు పోస్ట్ చేస్తున్నారు. అప్పటికే ఫేక్ ప్రొఫైల్స్తో ఉన్న డీపీతో వాట్సాప్ కాల్స్, మెసేజ్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు తమ దగ్గర ఉన్నాయని, తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే కాల్గర్ల్స్ వెబ్ సైట్లలో పెడతామని బెదిరిస్తున్నారు.