- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణం, పూర్వ వైభవం లక్ష్యంగా జులై మొదటి వారంలో బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకులతో రూట్మ్యాప్ ఖరారుపై చర్చించి బస్సు యాత్ర షెడ్యూల్ను ప్రకటిస్తామని చెప్పారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో మల్కాజ్గిరి, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో జ్ఞానేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, పార్టీ కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి గెలుపు కోసం శ్రమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు జులై మొదటివారంలో టీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్రను చేపడుతున్నామన్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంతటా సమష్టిగా కృషి చేస్తే బస్సు యాత్ర విజయవంతం అవుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సుయాత్ర విజయవంతమైతే పార్టీకి మంచి ఊపు రావడం తథ్యమని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడతుందన్నారు. 96 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపామన్నారు. పార్టీ కేడర్ సమరోత్సాహాంతో ఖమ్మంలో బహిరంగసభను పెద్ద ఎత్తున విజయవంతం చేశారని, అదే ఊపులో హైదరాబాద్లో పార్టీ అవిర్భావ సదస్సు సైతం దిగ్విజయం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మరలా
ప్రజల మద్దతు పెరుగుతూ వస్తోందని జ్ఞానేశ్వర్ అన్నారు.