- ఇండస్ట్రీస్ తరలింపు వార్తలు అవాస్తవం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: పారిశ్రామికాభివృద్ధి నగరాలకే పరిమితం కాకుండా ప్రతి జిల్లాకు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. శాసనమండలిలో సభ్యుడు మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నైపుణ్యం కలిగిన యువత ఉన్న ప్రాంతాల్లో ఆయా రంగాలకు అనుగుణంగా పరిశ్రమలను నెలకొల్పే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వికారాబాద్ జిల్లాలో గత రెండేళ్లలో 133 యూనిట్లకు టీజీ-పాస్ అనుమతులు ఇచ్చి రూ.112 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 1,518 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా 5,067 యూనిట్లకు అనుమతులు ఇచ్చామని, వాటి ద్వారా 1,82,121 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయన్న వార్తలను ఖండించారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష..
ఐటీ, సెమీ కండక్టర్ రంగాల్లో కేంద్రం కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యతనిస్తోందని శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కేంద్ర నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గత ప్రభుత్వ కాలంలో రూ.4,700 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని విడుదల చేస్తామని చెప్పారు. వరంగల్ పీఎం మిత్రా టెక్స్టైల్ పార్క్ పనులను స్పీడప్ చేస్తున్నామన్నారు. కిటెక్స్, యంగ్ వన్, గణేశా వంటి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
