- తెలంగాణ వర్సిటీ వీసీకి చెక్
- వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా అధికారాల కుదింపు
- త్రీమెన్ కమిటీకి నిర్వహణ బాధ్యతల అప్పగింత
- 130 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు హాట్టాపిక్గా మారాయి. వీసీ రవీందర్ గుప్తా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు రావడం, బుధవారం హైదరాబాద్లో పాలకమండలి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోవడం, వీసీ అధికారాలను కత్తిరిస్తూ అమలు చేయడం చర్చనీయాంశమైంది.
రూల్స్ ఏమిటంటే...
యూనివర్సిటీల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఈసీ సమావేశం ఏర్పాటు చేసి వారి ఆమోదంతోనే అమలు పరచాలి. కానీ, తెలంగాణ యూనివర్సిటీలో 2021 నవంబర్ 27 తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఒక్కసారి కూడా ఈసీ సమావేశం నిర్వహించలేదు. ఈ రెండేండ్లలో రిజిస్ట్రార్లుగా కనకయ్య, యాదగిరి,శివశంకర్, విద్యావర్ధిని పనిచేయగా ఇందులో ఈసీ ఆమోదం పొందిన అధికారి యాదగిరి ఒక్కరు మాత్రమే. అలాగే రోజువారి కూలీలతో పాటు ఔట్సోర్సింగ్పద్ధతిలో 130 మంది ఉద్యోగులను ఈసీ సమావేశం పెట్టకుండానే నియమించారు. కొందరికి పాత తేదీలపై ప్రమోషన్లు ఇచ్చి ఏరియర్స్గా రూ.లక్షలు మంజూరు చేసినట్టు కూడా తేలింది. వర్సిటీలో రూ.20 కోట్ల చొప్పున సైన్స్, హాస్టల్ బిల్డింగ్స్నిర్మించడం, 2021–--22 , 2022–23 సంవత్సరాల్లో రూ.90 కోట్ల చొప్పున బడ్జెట్రూపొందిం సర్కారు నివేదించడం ఇలా అన్నీ ఈసీ ఆమోదం లేకుండానే జరిగాయి. అవసరం లేకపోయినా ఫర్నిచర్ కొన్నారన్న ఆరోపణలు వచ్చాయి. 2014లో నియమితులైన వారికి పదోన్నతులు ఇవ్వడానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు డిమాండ్ చేస్తున్నారనే సమాచారం ఉన్నతాధికారులకు చేరింది.
ఉన్నతాధికారుల్లో కదలిక..నిర్ణయాలు చకచక
యూనివర్సిటీలో విషయాలను తెలుసుకున్న ఉన్నతాధికారులు బుధవారం హైదరాబాద్లో పాలకమండలి సమావేశం నిర్వహించారు. కాలేజీయేట్కమీషనర్నవీన్మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాల్గొన్న ఈ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అడ్డదారిలో నియామకమైన 130 మందిని డ్యూటీలకు రానివ్వొద్దని, ఇప్పటివరకు పొందిన జీతాలను రికవరీ చేయాలని ఆదేశించారు. అమలు బాధ్యతను ఈసీ మీటింగ్ ఆమోదం పొంది రిజిస్ట్రార్ అయిన యాదగిరికి అప్పగించారు. దీంతో గురువారం వర్సిటీకి వచ్చిన సదరు ఉద్యోగులను విధులకు రావొద్దని రిజిస్ట్రార్ యాదగిరి తిప్పి పంపారు.
వీసీ అధికారాలకు కత్తెర
బుధవారం సమావేశంతో పాటు గురువారం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా అధికారాలను కత్తిరించారు. చెక్పవర్ను తొలగించారు. నిర్వహణ అధికారాలను త్రీమెన్ కమిటీకి అప్పగించారు. కమిటీ మెంబర్స్గా రవీందర్రెడ్డి, ఆరితి, నసీమ్ వ్యవహరిస్తారు. రిజిస్ట్రార్తో సమన్వయం చేసుకొని ఉన్నతాధికారుల అనుమతితో వీరు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తారు. వీసీ నిర్ణయాలపై ఫైవ్మెన్ కమిటీతో విచారణ చేయిస్తామని నవీన్మిట్టల్ఇదివరకే ప్రకటించారు.
