- అబుదాబి ఎయిర్పోర్ట్లో ఘటన
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఇరాన్ క్షిపణిదాడిలో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లెకు చెందిన నందెల్లి రాజేశ్వర్ రావు గాయపడ్డాడు. ఈ ఘటన అబుదాబి ఎయిర్పోర్ట్లో చోటుచేసు
కుంది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్వర్ రావు నాలుగేండ్ల కింద అబుదాబి వెళ్లాడు. అక్కడి ఎయిర్పోర్ట్లో క్లీనింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పట్లాగే ఆదివారం
పనిచేస్తుండగా.. ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో ఎయిర్పోర్ట్అద్దాలు పగిలి, గాజు పెంకులు రాజేశ్వరరావు చేతికి, చాతి భాగంలో గుచ్చుకోవడంతో గాయపడ్డాడు. ఎయిర్పోర్ట్ సిబ్బంది అతడిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. చికిత్స అనంతరం తన గదికి పంపించారని బాధితుడు తన సోదరుడు రామారావుకు వాట్సాప్లో మెస్సేజ్ పెట్టాడు.
అలాగే, దాడి ఘటనలో ఎయిర్పోర్ట్ సమీపంలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు సమాచారం ఇచ్చాడు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్దాడుల నేపథ్యంలో ఫ్లైట్లు నిలిచిపోయాయని, రెండు, మూడు రోజుల్లో రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపాడు. రాజేశ్వర్రావు గాయపడ్డాడని తెలుసుకున్న అతని భార్య మీనా ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, రాజేశ్వర్ రావును స్వగ్రామం రప్పించేందుకు చొరవ తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.
