
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 65 ఏండ్లపాటు పోరాడామని, అందరి ఆకాంక్షలను సోనియా గాంధీ నెరవేర్చారని పీసీసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్చిన్నారెడ్డి అన్నారు. సోనియా లేకపోతే తెలం గాణ వచ్చేదే కాదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. వేడుకల నిర్వహణపై బుధవారం గాంధీభవన్లో ఆయన కమిటీ సభ్యులు, కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో రివ్యూ చేశారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడారు.
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేస్తామంటూ సర్కారు చెప్పుకుంటున్నదని, ఈ తొమ్మిదేండ్లలో ఏపాటి అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. జూన్2న ప్రతి జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని, సోనియాగాంధీ ఫొటోకు పాలతో అభిషేకం చేయాలని సూచించారు. ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించాలని కేడర్కు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినవారికి ప్రతి జిల్లాలోనూ సన్మానం చేస్తామన్నారు. తెలంగాణ బిల్లు పాసవ్వడంలో కీలక పాత్ర పోషించిన లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళి, అనంతరం బాబు జగ్జీవన్రామ్కు నివాళి అర్పిస్తామన్నారు. గాంధీభవన్కు ర్యాలీగా వచ్చి బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. కాగా, సర్కారుకు దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా 20 రోజుల కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఒక్కో రోజు ఒక్కో ఎజెండాతో బీఆర్ఎస్సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, రైతుల సమస్యలు, ధరణి తదితర అంశాలను ఎత్తి చూపాలని భావిస్తున్నట్టు పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.