అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం

అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం

హైదరాబాద్: అమెరికాలో ఓ తెలుగమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏఐ టెక్నాలజీ ద్వారా అడవుల్లో కార్చిచ్చులను ముందుగానే గుర్తించే పద్ధతిని రూపొందించినందుకు రేష్మ కొసరాజు(15)కు ప్రతిష్టాత్మక 2021 ‘చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్’ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అడవులు కాలిపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. దీని వల్ల ప్రకృతి నాశనం అవుతుండగా, పెద్ద సంఖ్యలో జంతువులు, ఇతర ప్రాణులు అంతమవుతున్నాయి. కార్చిచ్చులతో ఏర్పడే పొల్యూషన్ కారణంగా ఏటా సుమారు 3.39 లక్షల మంది అకాల మరణం చెందుతున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను ముందుగానే గుర్తించి, నివారించే అంశంపై కాలిఫోర్నియా స్టేట్ సరటోగా సిటీకి చెందిన రేష్మ ఏఐ ప్రాజెక్టును చేపట్టింది. రేష్మ రూపొందించిన ఏఐ టెక్నాలజీతో అడవుల్లో కార్చిచ్చులను 90 శాతం కచ్చితంగా ముందే అంచనా వేయొచ్చు. తనకు ఈ అవార్డు రావడంతో తన ప్రాజెక్టుపై అందరి దృష్టి పడే అవకాశం దొరికిందని రేష్మ సంతోషం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే పిల్లలకు చిల్డ్రన్స్  క్లైమేట్ ఫౌండేషన్ సంస్థ  గత ఆరేండ్లుగా ఈ అవార్డులను 
అందజేస్తోంది.