బాసర నుంచి కీసర వరకు... రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూసివేత...

బాసర నుంచి కీసర వరకు... రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూసివేత...

తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆలయాలు మూసివేశారు అర్చకులు, అధికారులు. మంగళవారం ( మార్చి 3 ) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూసివేశారు. కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్బంగా నిర్మల్ జిల్లా లోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ముసేసినట్లు తెలిపారు అధికారులు. ఉదయం 7 గంటలకు సరస్వతి, మహాకాలి, మహాలక్ష్మి, అమ్మవార్లకు అభిషేకం ప్రత్యేక పూజల అనంతరం సరస్వతి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఉపఆలయాలన్నింటిని మూసేసారు అర్చకులు, అధికారులు.

ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి సంప్రోక్షణ ఆలయ శుద్ధి మహా హారతి అనంతరం రేపు ( మార్చి 4 ) ఉదయం నుండి భక్తులకు సర్వదర్శనం, అర్జిత సేవలు కల్పించనున్నట్టు ఆలయ ఈఓ విజయ రామారావు, ఏఈఓ గంగ శ్రీనివాస్ తెలిపారు.

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ ఉదయం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు. ఉదయం 7 గంటలకు స్వామివారికి మహా నివేదన పెట్టిన అనంతరం ఆలయ ద్వార బంధనం చేశారు ఆలయ అర్చకులు. తిరిగి బుధవారం ( మార్చి 4 ) ఉదయం 5: 30 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం ఆర్జిత సేవలతో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

గ్రహణానికి ముందే.. సుమారు ఎనిమిది గంటల సమయం ముందే ద్వారా బంధనం చేసి ఆలయం మూసేశారు. గ్రహణం సమయంలో భగవంతుడు తన శక్తులు కోల్పోతాడు కాబట్టి గ్రహణం సమయం కన్నా ముందే ఆలయాలు ముసేసినట్లు తెలిపారు అర్చకులు.

చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ మూసివేశారు ఆలయ అర్చకులు, అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7:30 గంటల కి సేవలు ముగించి  గుడి ముసేసినట్లు తెలిపారు అర్చకులు. తిరిగి సాయంత్రం 7 గంటలకు శుద్ధి కార్యక్రమం జరుగుతుందని.. కానీ భక్తులకు దర్శనాలు ఉండవని వెల్లడించారు. బుధవారం ( మార్చి 4 ) ఉదయం 6గంటలకు భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు అధికారులు.