
అర్థరాత్రి గ్రేటర్ హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంతు కళేబరాలు తరలిస్తున్న డీసీఎంలపై దాడి చేసి వ్యాన్ లు తగలబెట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు కొట్టుకునే పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపైకి ఒక వర్గం రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపుదాటిపోయింది. ఈ ఘటన ఆదివారం (జూన్ 8) రాత్రి రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
మైలార్దేవుపల్లికి చెందిన నలుగురు యువకులు మూడు డీసీఎంలలో జంతు చర్మాలు, ఎముకలను పాతబస్తీ కామాటిపురా నుంచి జల్పల్లి శివారులోని కబేళాలకు తరలిస్తున్నారు. డీసీఎంలలో ఆవులను తరలిస్తున్నారంటూ మైలార్దేవుపల్లి నుంచి కొందరు వెంబడించారు. గోవులను తరలిస్తున్నారని సమీప బస్తీ యువకులకు సమాచారం అందించడంతో భారీగా చేరుకున్నారు. దాదాపు రెండు వందల మందికిపైగా యువకులు నినాదాలు చేస్తూ వాహనాలను అడ్డగించారు.
ఆవేశంలో ఉన్న మూక కళేబరాలను తరలిస్తున్న నలుగురినీ చితకబాదారు. ఓ డీసీఎంకు నిప్పంటించి.. మరో రెండింటిని ధ్వంసం చేశారు. అటుగా భార్యతో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తి.. వారిని నిలదీయగా కర్రలతో దాడి చేశారు. మహిళకు స్థానిక హోటల్ సిబ్బంది రక్షణ కల్పించగా.. హోటల్కు నిప్పంటిస్తామని హెచ్చరిస్తూ తలుపులు విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు.
పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసులు పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలిపారు. ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ, పోలీసు బలగాలతో ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులు పోలీసులపైనా రాళ్లు రువ్వడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
డీసీఎంను తగలబెట్టి, డ్యామేజ్ చేసినందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తులపై సామూహిక దాడికి దిగటం, ఆస్తులు ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని, అందుకు శిక్షలు తప్పవని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.