కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేసింది. జూన్ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 గంటల వరకు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిపరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్ను రూపొందించారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులందరూ భౌతిక దూరం పాటించేలా పరీక్ష హాల్లో చర్యలు తీసుకోనున్నారు.
జూన్ 8న ఇంగ్లీష్ పేపర్, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ స్టడీష్ పేపర్ 1, 29న సోషల్ స్టడీష్ పేపర్ 2 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.