అంతరిక్షంలో తెలుగు తేజం.. రెండో భారతీయుడిగా రికార్డు

అంతరిక్షంలో తెలుగు తేజం.. రెండో భారతీయుడిగా రికార్డు

గోపీచంద్ తోటకూర.. ఇప్పుడీ తెలుగు పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును లిఖించుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజన్ సంస్థ న్యూ షెపర్డ్-25 పేరుతో నిర్వహించిన అంతరిక్షయాత్రలో గోపీచంద్ పాలుపంచుకున్నాడు.

టెక్సాస్‌లోని ప్రయోగకేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక ధ్వనివేగానికి మూడింతల వేగంతో ప్రయాణించి భూ వాతావరణం, అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్ రేఖ ఎగువకు సుమారు 105.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ వెంటనే పర్యాటకులు కాసేపు భార రహత స్థితిని అనుభవించారు. అక్కడి నుంచి భూమిని తనివితీరా వీక్షించారు. పది నిమిషాల్లోనే యాత్రను ముగించుకున్న నౌక ఆపై సురక్షితంగా భూమిని చేరింది. బ్లూ ఆరిజన్ నిర్వహించిన ఏడో మానవసహిత యాత్ర కాగా.. తాము నివసించే భూమిని అంతరిక్షం నుంచి తనివితీరా వీక్షించారు.

అమెరికాలో పైలట్‌గా.. 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గోపి తోటకూర ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. అమెరికాలో స్థిరపడ్డారు. పైలట్‌గా, ఏవియేటర్‌గా పనిచేస్తున్నారు ఈయన. విమానాలతోపాటు సీప్లేన్‌లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను కూడా ఆయన నడిపిస్తారు. అట్లాంటలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే వెల్‌నెస్ సంస్థను స్థాపించారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్‌శర్మ రోదసిలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఓ భారతీయుడు, అందులోనూ ఓ తెలుగువాడు తోటకూర గోపీచంద్ అంతరిక్షంలోకి వెళ్లి ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించారు.