- స్కూల్ యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపణ
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తెల్లారితే టెన్త్ ఎగ్జామ్ రాయాల్సిన స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీ చైతన్య స్కూల్లో అప్పం నితీశ్(14) టెన్త్ చదువున్నాడు. తండ్రి లేకపోవడంతో కొడుకు చదువు కోసం తల్లి మౌనిక టేకులపల్లి మండలం కోయగూడెం నుంచి కొత్తగూడెం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని టైలరింగ్ చేసుకుంటూ జీవిస్తోంది.
ఫీజులు ఎక్కువైనప్పటికీ కొడుకుని ఉన్నతంగా చూడాలని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తోంది. ఈక్రమంలో రెండు నెలల కింద స్కూల్లో స్టూడెంట్స్ మధ్య గొడవ జరగగా, నితీశ్ను స్కూల్ యాజమాన్యం మందలించి కొత్తగూడెంలోని మరో బ్రాంచ్కు పంపించింది. దీనిని అవమానకరంగా భావించిన నితీశ్ పలుమార్లు తనను తిరిగి లక్ష్మీదేవిపల్లి స్కూల్కు పంపించాలని వేడుకున్నాడు.
అందుకు ఒప్పుకోకపోగా అవమానించేలా స్కూల్ యాజమాన్యం మాట్లాడింది. ఈక్రమంలో శుక్రవారం హాల్ టికెట్ కోసం వెళ్లిన నితీశ్ను గొడవలు చేస్తావు.. చదవవు.. ఫీజు కూడా కట్టలేదు.. హాల్ టికెట్ ఎందుకు ఇవ్వాలంటూ యాజమాన్యం మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్టూడెంట్స్ చెబుతున్నారు. ఈ విషయమై లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హాల్ టికెట్ విషయం, యాజమాన్యం వేధింపులు వంటివి కంప్లైంట్ లో పేర్కొనలేదని పోలీసులు చెప్పారు. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని తెలిపారు. నితీశ్ను వేధించలేదని, హాల్ టికెట్ కూడా తీసుకున్నాడని విద్యాసంస్థల ఏజీఎం జయప్రకాశ్ తెలిపారు.
