
గుంటూరు: ప్రేమిస్తున్నానంటూ ఓ పోకిరీ చేస్తున్న వేధింపులు భరించలేక ఓ అమాయకురాలైన బాలిక అర్థాంతరంగా తనువు చాలించింది. ఈనెల 13వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నిన్న బాలిక తుదిశ్వాస విడిచింది. అయితే ఐదు ఆరు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో బాలిక సెల్ఫీ వీడియోలో మాట్లాడినట్లు వీడియో బయటకు రావడం కలకలం రేపింది. వరప్రసాద్ అనే యువకుడు తనను వేధించేవాడని.. అతని వేధింపులు భరించలేకనే తాను చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగానని చెప్పింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదని.. తనను మానసికంగా క్షోభకు గురిచేసిన వరప్రసాద్ ను శిక్షించాలని బాలిక కోరింది.
మేడికొండూరు మండల పరిధిలోని కొర్రపాడు గ్రామానికి చెందిన సౌమ్య టెన్త్ చదువుతోంది. బాలిక స్కూలుకు వెళ్లి వచ్చేటప్పుడు తరచూ వెంటపడే వరప్రసాద్ అనే యువకుడు తనను ప్రేమించమని వేధింపులకు గురిచేస్తుండేవాడు. పోకిరీ చేష్టలు రాను రాను శృతి మించడంతో సౌమ్య భరించలేక మనస్తాపానికి గురై ఈనెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరిలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే గుంటూరు ఆస్పత్రిలోని వైద్యులు ఆరు రోజులుగా వైద్యులు చేసిన చికిత్సలు ఫలించలేదు. నిన్న తుదిశ్వాస విడిచింది. వరప్రసాద్ అనే పోకిరీ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు చేసుకున్నట్టు సౌమ్య వెల్లడించిన వీడియో విడుదల కావడంతో స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి బాధిత కుంటుంబాన్ని పరామర్శించారు. సౌమ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చి నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు.