మహా శివరాత్రికి వేములవాడ, శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. 2 వేల 243 TGSRTC ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రికి వేములవాడ, శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. 2 వేల 243 TGSRTC ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: మహా శివరాత్రికి 2 వేల 243 TGSRTC ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తెలిపింది. శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు పేర్కొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 

భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243  ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కె.పి.హెచ్.బి, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 రెట్ల వరకు టికెట్ ధరలను సవరించింది.

రెగ్యులర్ సర్వీస్ టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 14నుంచి 16 తేదీ వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 వతేది నుంచి 17 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంది.