తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్.. మే 4న కౌంటింగ్.. గెలిచే పార్టీ ఏదంటే..

తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్.. మే 4న కౌంటింగ్.. గెలిచే పార్టీ ఏదంటే..

చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తమిళనాడులో ఏప్రిల్‌ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న త‌‌మిళ‌‌నాడులో సింగిల్ ఫేజ్లోనే ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే  కూటమి, ఏడీఎంకే-బీజేపీ కూటమి, మూడో పక్షమైన విజయ్ టీవీకే పార్టీ మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది.

విజయ్ పార్టీతో బీజేపీ పొత్తుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. డీఎంకే  కూటమి 2021 అసెంబ్లీ ఎన్నికలలో, 2024 పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటింది. 2021 అసెంబ్లీ ఎన్నిక‌‌ల్లో డీఎంకే ప్రొగ్రెసివ్ సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ సుమారు 158 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేయ‌‌గా.. 17 స్థానాల్లో గెలిచింది.

►ALSO READ | బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. రెండు దశల్లో పోలింగ్

తమిళనాడులో 2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం.. సెప్టెంబర్ 2023 నుంచి కలైంగర్ మహిళా హక్కు పథకం పేరుతో మహిళలకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తున్నది. ప్రారంభంలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 1.13 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 1.31 కోట్లకు చేరింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తే ఈ నెలవారీ గ్రాంట్‌‌‌‌ను రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతామని ఆయన ప్రకటించారు.

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశం ఏమిటంటే.. తమిళనాడును  పాలిస్తున్న అధికార పార్టీ  డీఎంకే  కాంగ్రెస్​ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉంది. సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) కారణంగా తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. డీఎంకే-, కాంగ్రెస్  కూటమికి  అవకాశాలు బాగున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే ఫలితాలను అంచనా వేయడం తొందరపాటు అవుతుందని, ఇది కేవలం ఒక అంచనా మాత్రమేనని చెబుతున్నారు.