బీఎస్-6 ఎమిషన్ స్టాండర్డ్స్ సరే. మరి బీఎస్-4 వెహికల్స్ పరిస్థితి?

బీఎస్-6 ఎమిషన్ స్టాండర్డ్స్ సరే. మరి బీఎస్-4 వెహికల్స్ పరిస్థితి?

వెహికల్ పొల్యూషన్ ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీఎస్-6 ఎమిషన్ స్టాండర్డ్స్ ఏప్రిల్ నుంచే అమలు కానున్నాయి. ఈ నిబంధనలు అనుగుణంగా లేని వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉండదు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు బీఎస్-6 నిబంధనల్ని పాటిస్తూ… వెహికిల్స్ లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈ కొత్త వెహికల్స్ తో ఆటోమొబైల్ రంగంతో పాటు వినియోగదారులపై ఎంత భారం పడుతుంది? అంతకుముందున్న బీఎస్-4 వెహికల్స్ పరిస్థితి ఏంటి? ఆటోమొబైల్ ఇండస్ట్రీ మార్కెట్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..

రోజురోజుకు పెరుగుతున్న పొల్యూషన్ ని తగ్గించేందకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి తయారు చేసే వెహికల్స్ లో బీఎస్-6 టెక్నాలజీతో కూడిన ఇంజన్ మాత్రమే అమర్చాలనే రూల్ తీసుకొచ్చింది. బీఎస్-6 వాహనాల్ని రూపొందించాలంటే 20 శాతం వరకు బడ్జెట్ పెరుగుతుందంటున్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు. కొత్త రూల్ తో బండిని తయారు చేయాలంటే.. ప్యాసెంజర్ వెహికిల్స్ కి 12 నుంచి 15 శాతం, కమర్షియల్ కి 15 నుంచి 20 శాతం ఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు. డీజెల్ వెహికిల్స్ పై లక్ష నుంచి లక్షన్నర రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో మారుతి డిజీల్ వర్షన్ వెహికల్స్ తయారీని ఆపేసింది.

ఇప్పటికే వెహికల్స్ రేట్లు పదే పదే పెరుగుతుండటం, వడ్డీ రేట్లు ఎక్కువుండటంతో సేల్స్ పడిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు బీఎస్-6 నిబంధనలతో పెరిగిన మొత్తాన్ని కస్టమర్లపై వేస్తే..అమ్మకాలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు. అన్ని కేటగిరీల్లో వాహనాల రిటైల్ సేల్స్ దాదాపు 16 శాతం క్షీణించాయి. బీఎస్-6 నిబంధనలతో పెట్రోల్ వెహికిల్స్ తెచ్చేందుకు ..గతేడాదే మహింద్రా అండ్ మహింద్రా వేయి కోట్లకు పైనే ఇన్వెస్ట్ చేసింది. మారుతి సుజుకీ బాలెనోతో పాటు స్విఫ్ట్, వ్యాగనార్ మోడళ్లలో బీఎస్-6 వేరియంట్లని లాంచ్ చేసింది.

మోడల్ బట్టి ఒక్కో వెహికల్ పై 10 నుంచి 16 వేల రూపాయలకు పెరుగుతున్నాయి.  టూవీలర్ల కంపెనీ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ బీఎస్-6 ప్రమాణాలతో కూడిని యాక్టివా 125ని లాంచ్ చేసింది. బీఎస్-4 వర్షన్ తో పోలిస్తే..బీఎస్-6 ధర 10 నుంచి 15 శాతం అధికంగా ఉందని కంపెనీ ప్రకటించింది. కమర్షియల్ వెహికిల్స్ లో ఐషర్ ట్రక్ అండ్ బసెస్ కంపెనీ.. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఐషర్-ప్రో 2000 లైట్ కమర్షియల్ ట్రక్కులను మార్కెట్లోకి తెచ్చింది. ఇక బీఎస్-6 ఇంజన్ తో వచ్చే డీజిల్ బండ్లపై రేట్లు పెరుగుతుండటంతో వెహికిల్స్ కొనేవారు ముందే కొనేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నామంటున్న కేంద్ర ప్రభుత్వం.. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. వివిధ కంపెనీలు ఈ-వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నా… అన్ని ప్రాంతాలలో ఛార్జీంగ్ పాయింట్స్ లేకపోవడం, ఈ-వెహికిల్స్ పై ప్రభుత్వ సబ్సిడి లాంటి వాటిపై క్లారిటీ లేకపోవడంతో పెద్దగా సక్సెస్ అవ్వడంలేదంటున్నారు.