
హైదరాబాద్, వెలుగు: మొదటిసారి అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతుండగా ఆ శాఖ మంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం పరేడ్ గ్రౌండ్ లో ఫొటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ తమిళిసై ప్రారంభించి విమోచన ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలోనూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది మహిళలు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
17న ముఖ్య నేతలతో షా భేటీ
విమోచన ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకరోజు ముందే హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకోనున్నారు. శనివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. పారా మిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇటీవల చనిపోయిన కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్షా పరామర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, అధికారికంగా ఖరారు కాలేదన్నాయి. ఖరారైతే మాత్రం ప్రభాస్తో అమిత్ షా సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపాయి. శనివారం పరేడ్ గ్రౌండ్లో విమోచన ఉత్సవాలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆఫీసు బేరర్లతో, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదే రోజు ప్రధాని మోడీ బర్త్ డే కావడంతో పార్టీ ఏర్పాటు చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, విమోచన ఉత్సవాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను టీఆర్ఎస్ నేతలు చింపేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.