- అమెరికన్ సెనేటర్ ఆఫీస్లో మీటింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలోని చర్చిలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సేవా సంస్థల మనుగడకు ఇబ్బందికరంగా మారిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) సవరణ నిబంధనలను పునఃపరిశీలించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ సెనెటర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ సవరణల వల్ల లక్షలాది ధార్మిక, సేవా సంస్థల ఆస్తులు, నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోందని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో స్వచ్ఛంద సేవా రంగాన్ని, మానవతా దృక్పథంతో పనిచేసే సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కోట్లాది మంది క్రైస్తవులు, మిషనరీలు, స్వచ్ఛంద సంస్థల భద్రత, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎఫ్సీఆర్ఏ చట్టంలోని ఆందోళనకర నిబంధనలను తొలగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రతినిధుల సభ, సెనెట్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామని కేఏ పాల్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికన్ సెనెటర్ టిమ్ షీహి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణలో డాక్టర్ కేఏ పాల్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
