కక్ష సాధింపులనుసహించేది లేదు
రాహుల్ గాంధీపై వేటు వేయడమేంది?
సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నేతల ఫైర్
హైదరాబాద్, వెలుగు : రాహుల్గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సామాన్యుల తరఫున ప్రశ్నించినందుకు ఆయనపై అనర్హత వేటు వేశారని దుయ్యబట్టారు. రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో నోటికి నల్లబట్టలు కట్టుకుని నేతలు దీక్షలో కూర్చున్నారు. ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీకి చెందిన కాంగ్రెస్ నేత శైలజానాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. కక్షసాధింపులు సహించేది లేదని చెప్పారు.
విద్వేషంపై రాహుల్ పోరాటం: మన్సూర్ అలీ ఖాన్
దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరంతరం కృషి చేస్తున్నారని ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. విద్వేషంపై రాహుల్ పోరాడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు అడుగడుగునా మద్దతిస్తున్నదని ఆరోపించారు. కాగా, ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. చిన్న తప్పుకు రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధించారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని, ఈసారి రాష్ట్రంలో కచ్చితంగా వందకుపైగా సీట్లు గెలుస్తామని ఆయన చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛా సమానత్వాలను కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రాష్ట్రంలోనూ ఉపా కేసులతో పౌర హక్కుల కార్యకర్తలను సర్కారు వేధిస్తున్నదని ఆయన మండిపడ్డారు.
ఆరేండ్ల నిషేధమా?: జీవన్ రెడ్డి
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిం దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు రెండేండ్లు జైలు శిక్ష విధించడమే కాకుండా.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని, ఆరేండ్లు మళ్లీ పోటీ చేయకుండా నిషేధించారని అన్నారు. గతంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారన్న నెపంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్పై కేసీఆర్ సర్కార్ వేటు వేసిందని తెలిపారు. ఉచిత కరెంట్ విషయంలో పీపీఏ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని పీసీసీ చీఫ్ అంటే.. దాన్ని బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్పై మోదీ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం బలపడుతుండడంతోనే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిందని సంపత్ కుమార్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన సేవలు, ప్రాణ త్యాగాలను చరిత్రలో లేకుండా చేసేందుకు మోదీ కుట్రలు చేస్తున్నరని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.