ఏడు రోజుల ఆపరేషన్ పూర్తి : లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్‌ ఖాన్‌ హతం

ఏడు రోజుల ఆపరేషన్ పూర్తి : లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్‌ ఖాన్‌ హతం

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఏడురోజులుగా జరుగుతున్న ఎన్‌కౌంటర్ ముగిసింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్‌ ఖాన్‌ను భారత ఆర్మీ బలగాలు హతమార్చాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) విజయ్ కుమార్ మంగళవారం (సెప్టెంబర్ 19న) చెప్పారు. కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది రెండు మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్ ఖాన్‌ది అని తెలిపారు. 

అనంతనాగ్‌ జిల్లాలోని కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో దాగి ఉన్న ముష్కరుల కోసం భద్రతా సిబ్బంది గత మంగళవారం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజు(సెప్టెంబర్‌ 13) ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు దాగి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మేజర్‌ ఆశిష్‌ ధొనక్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్‌ భట్‌ అమరులయ్యారు.

అదే ఘటనలో ఓ జవాన్ ఆచూకీ గల్లంతయ్యింది. సెప్టెంబర్ 18 ఆ జవాను భౌతికకాయాన్ని పోలీసులు గుర్తించారు. అతడు పంజాబ్‌కు చెందిన సిపాయి ప్రదీప్‌ కుమార్‌ అని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉజైర్‌ అనంత్‌నాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు 26 జులై 2022 నుంచి ఆచూకీ లేడని తెలుస్తోంది.