బాలిక కిడ్నాప్ అయిందన్నా.. పోలీసులు పట్టించుకోలె

బాలిక కిడ్నాప్ అయిందన్నా.. పోలీసులు పట్టించుకోలె

మల్హర్, వెలుగు:  కన్నబిడ్డను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్ ముందు కాటారం– మంథని మెయిన్ రోడ్డును బ్లాక్ చేయడంతో రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తన కూతురు (14) కనిపించడంలేదని, ఆమెను తమ గ్రామానికే చెందిన ధారావత్ గోవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లుగా అనుమానం ఉందని నాచారానికి చెందిన తండ్రి ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 4 రోజులుగా తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆదివారం రాత్రి గ్రామస్థులతో కలిసి వచ్చిన బాధిత కుటుంబసభ్యులు కొయ్యూరు స్టేషన్ ముందు మెయిన్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. దీంతో మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. చివరకు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ వచ్చి బాధితులతో మాట్లాడారు. రెండు రోజుల్లో బాలిక ఆచూకీ కనిపెడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.