
- గౌహతి రైల్వే స్టేషన్లో ఏర్పాటు
గౌహతి: అస్సాంలోని గౌహతి రైల్వే స్టేషన్లో ట్రాన్స్ టీ స్టాల్ను రైల్వే ఏర్పాటు చేసింది. ప్లాట్ ఫారమ్ నంబర్ వన్పై ‘ట్రాన్స్ టీ స్టాల్’ను శుక్రవారం ఎన్ఎఫ్ రైల్వే జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా ప్రారంభించి, మాట్లాడారు. దేశంలోనే ఇది ఫస్ట్ ట్రాన్స్జెండర్ టీ స్టాల్ అని వెల్లడించారు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఈఎఫ్ఆర్) ఈ ప్రాంతంలో ఉన్న ఇతర రైల్వే స్టేషన్లలో ఇలాంటి టీ స్టాల్స్ను మరిన్ని ప్రారంభించాలని యోచిస్తున్నదని ఆయన తెలిపారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో ఎన్ఈఎఫ్ఆర్ ఈ ట్రాన్స్ టీ స్టాల్ను ప్రారంభించామని ఓ అధికార ప్రతినిధి సభ్యసాచి దే చెప్పారు.
ఈ టీ స్టాల్ను ట్రాన్స్జెండర్లే ఆపరేట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్ఈఎఫ్ఆర్తో కలిసి ఆల్ అస్సాం ట్రాన్స్జెండర్ అసోసియేషన్ పని చేయనుందని వెల్లడించారు. అస్సాం ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ స్వాతి బిదాన్ బారుహ్ మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ పథకాల కింద రానున్న రోజుల్లో మరింత మంది ట్రాన్స్జెండర్లకు పునరావాసం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.