బ్రిస్బేన్: తన ఫిట్నెస్పై ఆందోళనకు తెరదించుతూ.. స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా రీప్లేస్మెంట్గా తనే సరైనోడినని నిరూపిస్తూ.. ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (3/4) లాస్ట్ ఓవర్లో సెన్సేషనల్ బౌలింగ్ చేశాడు. ఓ రనౌట్ సహా నలుగురిని ఔట్ చేసి ఔరా అనిపించాడు. దాంతో, టీ20 వరల్డ్ కప్ తొలి వామప్ మ్యాచ్లో ఓటమి అంచుల్లోంచి బయటపడిన ఇండియా ఆతిథ్య ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. షమీ, హర్షల్ పటేల్ (1/30) సూపర్ బౌలింగ్, కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ దెబ్బకు ఆసీస్ 9 పరుగుల తేడాలో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. దాంతో, సోమవారం జరిగిన ఈ పోరులో రోహిత్సేన 6 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 186/7 స్కోరు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో57), సూర్యకుమార్ యాదవ్ (33 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 50) ఫిఫ్టీలతో రాణించారు. ఛేజింగ్లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (54 బాల్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో76) దంచికొట్టినా ఫలితం లేకపోయింది. బుధవారం జరిగే రెండో వామప్లో న్యూజిలాండ్తో ఇండియా పోటీ పడుతుంది.
రాహుల్, సూర్య మెరుపులు
తొలుత బ్రిస్బేన్ వికెట్పై పేస్, బౌన్స్ను సద్వినియోగం చేసుకుంటూ ఇండియా బ్యాటర్లు భారీ స్కోరు చేశారు. కెప్టెన్ రోహిత్ (15) జాగ్రత్తగా ఆడగా.. రాహుల్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. కమిన్స్, స్టోయినిస్ను టార్గెట్ చేసి క్లాసిక్ షాట్లతో ఫోర్లు, సిక్సర్లు కొట్టిన తను 27 బాల్స్లోనే ఫిఫ్టీ దాటాడు. ఓపెనర్లు వరుస ఓవర్లలో వెనుదిరిగిన తర్వాత కోహ్లీ (19) తోడుగా సూర్య కుమార్ ఫామ్ కొనసాగించాడు. అగర్ బౌలింగ్లో కోహ్లీ సిక్స్, సూర్య రెండు ఫోర్లతో 11 ఓవర్లకే స్కోరు 100 దాటించారు. స్టార్క్ బౌలింగ్లో విరాట్, కేన్ రిచర్డ్సన్ ఓవర్లో హార్దిక్ (2) ఔటైనా సూర్య తన దాడి కొనసాగించాడు. అతనికి కార్తీక్ (20) సపోర్ట్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో ఫోర్తో సూర్య ఫిఫ్టీ (33 బాల్స్లో) కంప్లీట్ చేసుకున్నాడు. కేన్ రిచర్డ్ సన్ (4/30) నాలుగు వికెట్లు తీశాడు.
ఆఖర్లో అద్భుతం
భారీ టార్గెట్ ఛేజింగ్ను ఆసీస్ దూకుడుగా స్టార్ట్ చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (35), ఫించ్ ఎదురుదాడి చేశారు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో రెచ్చిపోతున్న మార్ష్ను ఆరో ఓవర్లో భువనేశ్వర్ (2/20) ఔట్ చేయగా పవర్ ప్లేలో ఆసీస్ 64/1తో నిలిచింది. స్మిత్ (11) ఫెయిలైనా మ్యాక్స్వెల్ (23) సపోర్ట్తో ఫించ్ అదే జోరు కొనసాగించడంతో 15 ఓవర్లకు ఆసీస్ 144/2తో నిలిచింది. ఈ దశలో మ్యాక్సీని భువీ, స్టోయినిస్ (7) అర్ష్దీప్ (1/34) పెవిలియన్ చేర్చినా ఫించ్ సిక్స్, టిమ్ డేవిడ్ ( 5) ఫోర్ రాబట్టారు. దాంతో, చివరి రెండు ఓవర్లలో ఆ జట్టుకు 16 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. 19వ ఓవర్లో 5 రన్సే ఇచ్చిన హర్షల్ ఫించ్ ను క్లీన్ బౌల్డ్ చేయగా.. డేవిడ్ రనౌటయ్యాడు. ఆఖరి ఓవర్లో ఆసీస్ కు 11 పరుగులు కావాల్సి వచ్చింది. అప్పటి దాకా బౌలింగ్కు దూరంగా ఉన్న షమీ బంతి అందుకొని మ్యాజిక్ చేశాడు. తొలి రెండు బాల్స్కు కమిన్స్ (7) రెండు డబుల్స్ తీశాడు. చివరి నాలుగు బాల్స్ లో 7 రన్స్ అవసరం అవగా ఆసీస్కే మొగ్గు కనిపించింది. మూడో బాల్కు కమిన్స్.. కోహ్లీకి క్యాచ్ ఇవ్వగా.. నాలుగో బాల్కు అగర్(0) రనౌటయ్యాడు. ఆపై వరుస యార్కర్స్తో ఇంగ్లిస్ (1), కేన్ రిచర్డ్ సన్ (0) లను షమీ బౌల్డ్ చేయడంతో ఇండియా గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 186/7 (కేఎల్ రాహుల్ 57, సూర్య 50, కేన్ రిచర్డ్ సన్ 4/30)
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 180 ఆలౌట్ (ఫించ్ 76, షమీ 3/4, భువనేశ్వర్ 2/20).
కోహ్లీ ఫీల్డింగ్ కమాల్
ఈ మ్యాచ్లో కోహ్లీ తన మెరుపు ఫీల్డింగ్తో మెప్పించాడు. 19వ ఓవర్లో టిమ్ డేవిడ్ను సూపర్ త్రో చేసి రనౌట్ చేసిన విరాట్.. లాస్ట్ ఓవర్లో కమిన్స్ క్యాచ్ను లాంగాన్లో వెనక్కి రన్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో అందుకున్నాడు.