రాజేంద్రనగర్​లో తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్

రాజేంద్రనగర్​లో తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్
  • రాజేంద్రనగర్​లో హైకోర్టు కొత్త బిల్డింగ్
  • 100 ఎకరాల్లో నిర్మించేందుకు వచ్చే నెల శంకుస్థాపన!

హైదరాబాద్, వెలుగు : వచ్చే నెలలో తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్​లోని ఎంసీ ఆర్ హెచ్ఆర్డీలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్నందున్న నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.  రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు. అదే విధంగా కొత్త జిల్లాల్లో  కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. 

అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా స్పష్టం చేశారు.  ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.