- కేసీఆర్, ఇతరుల పిటిషన్లపై విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో విధాన, పరిపాలనా, ఆర్థికపరమైన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది.
ఫిబ్రవరి 25వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్ రావు, ఎస్కె జోషి, స్మితా సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.
