శ్మశానాలు కబ్జా చేస్తున్నా పట్టించుకోరా..?

శ్మశానాలు కబ్జా చేస్తున్నా పట్టించుకోరా..?

పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
వక్ఫ్ బోర్డు పై హైకోర్టు ఆగ్రహం
విచారణ వచ్చే నెల 11కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: శ్మశానాల కబ్జాలను వక్ఫ్‌‌బోర్డు సాధారణ అంశంగా చూస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంలో వక్ఫ్‌‌బోర్డు చైర్మన్ ‌‌అసమర్ధ‌త చాటుకుంటున్నారని మండిపడింది. 63 శ్మశానాలు ఆక్రమణలకు గురైనట్లుగా వక్ఫ్‌‌బోర్డు కౌంటర్ ‌‌పిటిషన్ ‌‌వేసిందేగానీ, ఎవరు కబ్జా చేశారు, వాటి సర్వే నంబర్ల వివరాలతో సమగ్ర నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. రెవెన్యూ శాఖకు మాత్రమే ఫిర్యాదు చేసి, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీసింది. ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటే ఆక్రమణ దారులతో వక్ఫ్ ‌బోర్డు కుమ్మక్కయినట్టుగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. సంబంధిత పోలీస్‌‌స్టేషన్లలో వక్ఫ్ ‌‌బోర్డు ఫిర్యాదు చేయడానికి ఏ శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించింది.

హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని శ్మశానాలను కబ్జాదారుల నుంచి కాపాడాలని హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ‌ఇలియాస్ ‌‌హైకోర్టులో పిల్ వేశారు. రాష్ట్రంలో ముస్లింల శ్మశానాలను కాపాడడానికి, నిర్వహించడానికి రూల్స్, గైడ్ లైన్స్ లేవని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై చీఫ్‌‌జస్టిస్‌‌ రాఘవేంద్రసింగ్ ‌‌చౌహాన్, జస్టిస్‌‌ బొల్లం విజయసేన్ రెడ్డిల డివిజన్‌‌బెంచ్‌‌ మంగళవారం విచారించింది. వక్ఫ్‌‌బోర్డు తీరు చూస్తేమైనార్టీల ర్టీ అభ్యున్నతికి పాటుపడుతున్నట్టుగా లేదని వ్యాఖ్యలు చేసింది. శ్మశానాలన్నీ కబ్జా అవుతుంటే చివరికి ముస్లింలు మరణిస్తే ఎక్కడ ఖననం చేస్తారని వక్ఫ్‌ బోర్డును బెంచ్ ప్రశ్నించింది. ఆక్రమణలను అరికట్టేం దుకు తీసుకున్న చర్యలతోపాటు ఫిర్యాదులు రెవెన్యూ శాఖకే ఎందుకు పరిమితం చేశారో, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బోర్డులో తగినంత మంది ఉద్యోగులు లేరని చెప్పడంపై స్పందించిన బెంచ్.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే పరిష్కారం లభిస్తుందని చెప్పింది. వక్ఫ్ ‌బోర్డుకు ఒక మంత్రి కూడా ఉన్నారని, ప్రభుత్వంలో చర్చిస్తే సమస్యకు పరిష్కారం లభించేదని అభిప్రాయ పడింది. శ్మశానాలను కాపాడడానికి చట్టరీత్యా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ ‌11కు వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..