మేడారం జాతరలో కొవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలి

మేడారం జాతరలో కొవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలి

హైదరాబాద్: మేడారం జాతర, వారాంతవు సంతల్లో కొవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. స్కూళ్ల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది తెలపగా.. వెంటనే ప్రారంభంపై వివరాలు తెలపాలని ఆదేశించింది. ఆన్‌లైన్ విచారణకు డీహెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంది. 77 లక్షల ఇళ్లల్లో ఫీవర్ సర్వే చేసి 3.45 లక్షల కిట్లు అందజేసినట్టు డీహెచ్ తెలిపారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్ పేర్కొన్నారు. 3 రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.