జడ్చర్ల మండలం మల్లె బోయిన్​పల్లి వద్ద ఘటన

జడ్చర్ల మండలం మల్లె బోయిన్​పల్లి వద్ద ఘటన

జడ్చర్ల టౌన్, వెలుగు: ఎన్​హెచ్44పై మొక్కలు నాటుతుండగా కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. మహబూబ్‌‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లె బోయిన్ పల్లి శివారులో గురువారం ఈ ప్రమాదం జరిగింది. మొక్కలు నాటేందుకు అధికారులు ఆలూరు నుంచి ఉపాధి కూలీలను తీసుకొచ్చారు. ముగ్గురు కూలీలు ట్రాక్టర్​లో ఉండి, మొక్కలను కింద ఉన్నవారికి అందిస్తుండగా.. వేగంగా వచ్చిన కంటైనర్ ట్రాక్టర్​ను ఢీ కొట్టగా ట్రాక్టర్ ముందు వెళ్తున్న మరో కంటైనర్ కిందకు దూసుకుపోయింది. దీంతో ట్రాక్టర్​పై ఉన్న కూలీలు చాకలి లలిత (30), యాదయ్య (50) అక్కడికక్కడే చనిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ విష్ణు(28) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూలీలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎస్పీ వెంకటేశ్వర్లు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. 

అనాథలైన ఇద్దరు చిన్నారులు.. 
ప్రమాదంలో చనిపోయిన లలితకు ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. లలిత భర్త శ్రీశైలం రెండు నెలల కిందటే కర్నూలు జిల్లాలో జరిగిన యాక్సిడెంట్​లో చనిపోయాడు. ఇంతలోనే లలిత కూడా యాక్సిడెంట్ లో మృతిచెందడంతో వారి ఇద్దరు పిల్లలు నవ్యశ్రీ (8), తేజ (6) అనాథలుగా మారారు.