భార్యకు కరోనా.. భర్త గుండెపోటుతో మృతి

భార్యకు కరోనా.. భర్త గుండెపోటుతో మృతి

కరోనా భయంతో దగ్గరకు రాని బంధువులు

స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ , వెలుగు : భార్యకు కరోనా అని తెలిసి భర్త గుండెపోటుతో మరణించిన సంఘటన జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే … మల్లాపూర్ మండలంలోని రాఘవపేట్ గ్రామానికి చెందిన బెజ్జరపు పరమానందం (50) అతని భార్య కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం కరోనా రాపిడి టెస్ట్  చేయించుకోగా.. కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. భార్యకు కరోనా అని విన్న పరమానందం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.

మృతి చెందిన పరమానందం వద్దకు కరోనా భయంతో బంధువులు ఎవరూ రాకపోవడంతో స్థానిక సర్పంచ్ లావణ్య నర్సయ్య , ఉప సర్పంచు అమీనుద్దీన్లు చలించి కోరుట్ల పట్టణానికి చెందిన ఆలిండియా మానవత్వ సందేశ సేవా సమితి సభ్యులకు తెలుపగా.. అ స్వచ్ఛంద సంస్థ సభ్యులు హిందూ సాంప్రదాయం ప్రకారం సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం సంస్థ సభ్యులు నాసిర్ అలీ , ఇసాక్ , అబ్దుల్లా , హఫీజ్, అబ్దుల్ రబ్ లను తహశీల్దార్ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.