ఎలక్షన్ పోలింగ్ డేకు వరుణ గండం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఎలక్షన్ పోలింగ్ డేకు వరుణ గండం..  ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం చెప్పింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వం సిద్ధమవుతున్న క్రమంలో రాష్ట్రానికి వాతావరణ కేంద్రం వర్ష సూచన ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం (నవంబర్ 30న) వాయుగుండంగా బలపడనుందని కేంద్ర వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం నుండే మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో గురువారం (నవంబర్ 30న) మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 

హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు తేలిక పాటి వర్షాలు .. దక్షిణా తెలంగాణ జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1 సెంటీమీటర్లు, నిజామాబాద్‌ నార్త్‌లో 4.35 సెంటీమీటర్లు, నిజామాబాద్‌లో 3.93 సెంటీమీటర్లు, నిజాంపేటలో 3.58 సెంటీమీటర్లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45 సెంటీమీటర్లు, చిన్నమావంధిలో 3.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.